గత కొన్ని రోజులుగా ఏపిలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై తర్జన భర్జన జరుగుతూ వచ్చింది. ప్రతిపక్షాలు కరోనా నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయాలంటూ పట్టుబట్టిన విషయం తెలిసిందే. మొత్తానికి ఏపీలో పరీక్షల నిర్వహణపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు కీలక నిర్ణయం ప్రకటించారు. 31 జూలైలోపు పరీక్షలను నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఆ సమయంలో పరీక్షలను నిర్వహించడం సాధ్యం కాదని చెప్పిన మంత్రి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
సుప్రీం ఆదేశించిన గడువులో పరీక్షలను పూర్తి చేయలేని కారణంగా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. విద్యార్థులు ఏ రకంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. తాజాగా పరీక్షల రద్దు విషయంపై టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడిన రాక్షసక్రీడ ముగిసిందని తెలిపారు.
రెండు నెలల పోరాటం తర్వాత వైఎస్ జగన్ గారు దిగొచ్చి పరీక్షలు రద్దు చేయడం సంతోషం అని పేర్కొన్నారు. పరీక్షల రద్దు కోసం పోరాడి విజయం సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అభినందనలు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.