వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాబు దగ్గర ప్యాకేజీలు తీసుకొనే వాళ్లకు ప్రజా సమస్యలు ఏం తెలుస్తాయని విమర్శించారు. పవన్ నాలుగు రోజుల పర్యటనలో ఎక్కువగా జగన్నే టార్గెట్ చేసి మాట్లాడారు. ప్రజాసమస్యలు తీర్చాలంటే పదవులు ఉండనక్కర్లేదని , అసెంబ్లీ సమావేశాలను బహిస్కరించడం సరికాదని పవన్ విమర్శలు గుప్పించారు.
జగన్ను విమర్శించే నైతిక హక్కు పవన్కు లేదన్నారు. జగన్ నిత్యం ప్రజల మధ్యన ఉండి వారి సమస్యలకోసం పోరాడుతున్నారని రోజా తెలిపారు. 2014లో నువ్వు చెబితేనే భాజాపా,టీడీపీకి ఓటు వేశారని మండిపడ్డారు. పవన్ గజినీ కాకపోతే నరేంద్రమోడి, చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీసారు.
ప్యాకేజీ కోసమే పవన్ కళ్యాణ్ తమ పార్టీ అధినేతపై విమర్శలు చేస్తున్నారన్నారు. ప్యాకేజీలు తీసుకుంటే ప్రజా సమస్యలు ఎలా పడతాయన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వని మోడీని, ప్రజలకు న్యాయం చేయని చంద్రబాబును ప్రశ్నించాల్సింది పోయి మమ్మల్ని ప్రశ్నించడం ఏమిటని మండిపడ్డారు. పవన్కు పదవులు వద్దనుంకుంటే ట్రస్ట్ పెట్టుకోవాలని పవన్కు సూచించారు.