ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు విమర్శలు మొదలెట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు పాలక పార్టీ ఎదుర్కొంటుంటే ఇప్పుడు తాజాగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. చంద్రబాబును మించిన పెద్ద నటుడు ఎవరూ లేరని పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి విమర్శించారు.
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలవరం పూర్తి చేయాలని, పోలవరం ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న అవకతవకాలపై చర్యలు తీసుకోవాలని మహాపాదయాత్ర చేపట్టారు. శనివారం ఈ పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభ సభలో పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పైనే పిచ్చి అని, ఆంధ్రప్రదేశ్లో అదే విధమైన పరిపాలన సాగుతోందని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు మోదీ ప్రభుత్వం నుంచి బయటకొచ్చే దమ్ము చంద్రబాబుకు ఉందా అని సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్ట్ ఏపీ ప్రజల జీవనాడి అని, పోలవరానికి ప్రాణం పోసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, జీవీ హర్షకుమార్ తదితరులు పాల్గొన్నారు. ధవళేశ్వరం నుంచి పోలవరం మహా పాదయాత్ర ప్రారంభమై నాలుగు రోజుల పాటు 47 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి పశ్చిగోదావరి జిల్లా కొవ్వూరు వరకు 12.4 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగుతుంది. తర్వాత పోలవరం త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి పదో తేదీన పోలవరంలో సామూహిక సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నారు.