పార్టీల అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో దిగడంతో మరింత రాజకీయాలు వేడెక్కాయి. గులాబీ అధినేత కేసీఆర్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇప్పుడు భాజాపా కూడా తమ అగ్రనేతలను ప్రచార బరిలోకి దింపింది. తాజాగా ప్రధాని మోదీ నిజామాద్ జిల్లాలో భాజాపా తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కరెంట్ సరఫరా లేదనీ… మంచినీరు లేదని మోడీ చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
కరెంట్ సరఫరా సరిగా ఉందో లేదో నిజామాబాద్ సభలోనే తేల్చుకుందామని కేసీఆర్ మోడీకి సవాల్ విసిరారు. తాను ఎవరికీ భయపడబోనని, భయపడడానికి తాను చంద్రబాబును కానని ఆయన అన్నారు. “రమ్మంటే హెలికాప్టర్ లో నేను నిజామాబాద్ కే వస్తా, నువ్వు కూడా రా.. ఇద్దరం కలిసి అడుగుదాం.. సభ పెట్టి ప్రజలను అడుగుదాం.. ప్రజలు కరెంట్ కు ఇబ్బందులు పడుతున్నారా అడుగుదాం” అని అన్నారు.
పదవీకాలాన్ని మధ్యలోనే ముగించానని మోదీ విమర్శించారని… అధికారం అనుభవించడం ఇష్టంలేక పదవీకాలాన్ని ముగించామా? అని కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్-మజ్లిస్ రెండూ మిత్రపక్షాలుగా పనిచేస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ ను అస్థిరపరచాలని మోదీ, చంద్రబాబులు యత్నించారని మండిపడ్డారు.