తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 278 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం… గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 111 మంది కోలుకున్నారు. మరోవైపు కొన్ని విద్యా సంస్థల్లో విద్యార్థులకు కరోనా పాజిటీవ్ రావడంతో తల్లిదండ్రులు టెన్షన్ లో పడిపోయారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడంతో 8వ తరగతి వరకు బడులను మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే, 8వ తరగతి వరకు విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే పాస్ చేయించాలని కూడా నిర్ణయించినట్టు సమాచారం.
ఈ విషయం పై రెండు, మూడు రోజుల్లోనే స్పష్టమైన ప్రకటన చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. 24వ తేదీ నుంచి 6 నుంచి 8 తరగతుల వరకు ప్రత్యక్ష బోధనకు అనుమతి నిచ్చిన ప్రభుత్వం ప్రాథమిక తరగతుల విద్యార్థులకు మాత్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. 8వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని, వారిని ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.