బెజవాడ వైసీపీ నేతల మధ్య రగడ రోజుకో రకంగా తెరమీదకు వస్తోంది. వైసీపీ నేతలు పరస్పర ఆధిపత్య పోరులో తీరిక లేకుండా బిజీ అయిపోయారు. మంత్రిపై ఎమ్మెల్యే ఒకరు పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నం ఇప్పటికే వివాదంగా మారగా.. తాజాగా మరో కొత్త పంచాయితీ వెలుగులోకి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలైన బెజవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ఇద్దరు కమ్మ నేతలకు సీఎం జగన్ పార్టీలో అవకాశం ఇచ్చారు. వీరిలో ఒకరు బెజవాడ ఈస్ట్ పార్టీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ కాగా, మరొకరు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొప్పన భవకుమార్. ఈయనకు విజయవాడ వైసీపీ వ్యవహారాల అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం ఇద్దరు నేతల మధ్య రగులుతూనే ఉంది.
నేనే అంటే నేనే
బెజవాడ తూర్పు నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్నాను కనుక ఎమ్మెల్యే క్యాండిడేట్ను తానే అన్నట్టుగా అవినాష్, గతం ఎన్నికల్లో స్వల్ప తేడా (15 వేల ఓట్లు)తో ఓటమి చెందాను కనుక తానే మళ్లీ పోటీ చేస్తానని భవకుమార్ ఇద్దరూ.. తమ తమ అనుచరుల వద్ద ప్రకటించుకుంటూనే ఉన్నారు. ఈ విషయంలో అవినాష్ మరింత దూకుడుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన తరచూ నియోజకవర్గం పరిధిలోని ప్రజలతో టచ్లో ఉంటున్నారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. ఇక, భవకుమార్ కూడా నియోజకవర్గంలో యాక్టివిటీ పెంచారు. అయితే, నిన్నా మొన్నటి వరకు బాగానే ఉన్న ఇద్దరి మధ్య రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా దేవినేని వర్గం భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. విజయవాడ బస్టాండు, బెంజిసర్కిల్.. తూర్పు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు భారీ ఎత్తును ఏర్పాటు చేశారు.
పోటీ పోటీగా ఫ్లెక్సీలు
ఇక పార్టీలో ప్రోటోకాల్ ప్రకారం.. నగర అధ్యక్షుడిగా ఉన్న బొప్పన భవ కుమార్ ఫొటోను కూడా ఫ్లెక్సీపై ముద్రించాలి. కానీ, దేవినేని అవినాష్ వర్గం మాత్రం సీఎం జగన్, మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఫొటోలతోపాటు అవినాష్ చిత్రాన్ని భారీగా ముద్రించి.. బొప్పన భవకుమార్ ఫొటోను ఎలిమినేట్ చేసింది. దీంతో భవకుమార్ వర్గం అగ్గిమీద గుగ్గిలమైంది. పోటీగా.. భవకుమార్ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఇది చిలికి చిలికి గాలివానగామారి ఇరు పక్షాల మధ్య తీవ్ర వివాదం అయ్యే పరిస్థితికి చేరింది. అంతేకాదు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు ఎవరికి అనుకూలంగా వ్యవహరించాలో తెలియక తలలు పట్టుకుంటోంది. టికెట్ విషయం రేగిన వివాదం… ఎన్నికలకు మూడేళ్ల ముందే ఇలా ఉంటే.. ముందు ముందు ఎలా ఉంటుందోనని పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయి. రాజకీయం రసవత్తరంగా మారి మరోసారి టీడీపీకి అనుకూలం అయ్యే అవకాశాలూ లేకపోలేదని పొలిటికల్ అనలిస్టులు కూడా అభిప్రాయపడుతున్నారు. వైసీపీ పెద్దలు ఈ పంచాయితీని సర్దుబాటు చేస్తారో లేదో చూడాలి.