టీటీడీ ప్రధాన అర్చకుల రిటైర్ మెంట్పై పాలకమండలి తీసుకున్న వివాదాస్పద నిర్ణయం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. తన స్వార్థ రాజకీయాలకోసం వెంకటేశ్వర స్వామినీ వదల్లేదని మండిపడ్డారు.
ఆలయంలో జరుగుతున్న ఘోరాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదన్నారు. ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల ఆరోపణలకు టీటీడీ సమాధానం చెప్పడం లేదని, తప్పును ప్రశ్నించిన రమణ దీక్షితులుపై చర్యలు ఎంతవరకు సమంజసమని భూమన ప్రశ్నించారు.
రెండేళ్లు అధికారంలో ఉండేవారు.. ఏళ్ల నుంచి పూజలు చేసేవారిపై చర్యలు తీసుకుంటారా అని ఆయన ధ్వజమెత్తారు. అర్చకులపై పెత్తనం చేయడానికి చంద్రబాబుకు అధికారం లేదని, కలియుగ వైకుంఠాన్ని నరకంగా మారుస్తున్న చరిత్ర చంద్రబాబుది అని ఆరోపించారు. బాబు పరిపాలనలో 45 దేవాలయాలు కూల్చేసి ఘజినీలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు పాలన అవినీతి, నేరాలు, ఘోరాలతో సాగుతుందని భూమన దుయ్యాబట్టారు. విజయవాడ దుర్గ గుడిలో ఎలాంటి పూజలు జరిగాయో.. అలాంటివే శ్రీవారి ఆలయంలో జరుగుతున్నాయని అర్చకులు చెబుతారనే తీసేశారని పేర్కొన్నారు.
అర్చక వ్యవస్థలో చంద్రబాబు తలదూర్చి.. హిందూ సంప్రదాయాలకు ఘోరాతి ఘోరం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలోనే 1000 కాళ్ల మండపాన్ని కూల్చేశారని, వారసత్వాలు సంప్రదాయాలపై దాడి సరికాదని భూమన హితవు పలికారు.