అసెంబ్లీ సమావేశాల బహిష్కరణపై వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని వారికి జీతాలు ఎందుకని బాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. జీతం అనేది ఎమ్మెల్యేలకు రాజ్యాంగం కల్పించిన హక్కు, అసెంబ్లీకి వెళ్తే ఇచ్చేది కేవలం భత్యమే అని వెల్లడించారు. అది కూడా సీఎం చంద్రబాబుకు తెలియదాని ప్రశ్నించారు.
తన అనుకూల మీడియా ద్వారా వైసీపీపై బాబు దుస్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలని ఎందుకు అనర్హులుగా ప్రకటించరని ప్రశ్నించారు. చంద్రబాబు గతంలో పాదయాత్ర చేస్తూ అసెంబ్లీకి వెళ్లకుండా జీతం తీసుకున్న సంగతి గుర్తులేదా అని సూటిగా అడిగారు.
కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు నువ్వు ఇష్టానుసారంగా ఖర్చుపెట్టడం సబబేనా అని ప్రశ్నించారు. ముంబై వెళ్లి గంట కొట్టి రావడానికి లక్షల రూపాయల ఖర్చా?..నీ మంత్రి పుచ్చి పోయిన పంటికి వైద్యం చేయించుకోవడానికి లక్షల రూపాయల ఖర్చా?..పార్క్ హయత్ హోటల్లో నీ కుటుంబానికి మూడు సూట్లు బుక్ చేసి ప్రభుత్వ సొమ్ము దుబారా చేయడం వాస్తవం కాదా? అని ప్రశ్నలు సంధించారు.
తెల్లారి లేస్తే అబద్ధాలు ఆడటం, మోసాలు చేయడమే బాబు నైజమని విమర్శించారు. బాబుకు మైండ్ దొబ్బిందన్నారు. అసెంబ్లీ బులెటిన్లో ఇప్పటికీ ఫిరాయింపు ఎమ్మెల్యేలని మా పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్గా చూపుతున్నారని వెల్లడించారు. చంద్రబాబు చెప్పటానికే నీతులు..ఆచరణలో మాత్రం శూన్యమన్నారు. మా జీతాల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని, నువ్వు తప్పు చేసినట్లు లెంపలేసుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు.