200 ఏళ్ల బ్రిటిష్ వారి నిరంకుశ పాలనకు చరమ గీతం పడుతూ ఎందరో మహానుభావులు వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి మనకు స్వాతంత్ర్యాన్ని అందించారు. మన దేశం బానిస సంకెళ్ళను తెంచుకొని ఈ ఏడాది ఆగష్టు 15 తో 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75 వ ఇండిపెండెంట్ ఇయర్ లోకి అడుగు పెడుతున్నాము. అయితే ఆగష్టు 15 ఎంత ఆనందాన్ని కలిగించిన దినమో మనందరికి బాగా తెలుసు. మన దేశ చరిత్రలో ఆగష్టు 15 ఎంత సంతోషనిచ్చిందో.. ఆగష్టు 14 అంతటి కన్నీళ్లు మిగిల్చింది.
అందుకే మనదేశ స్వాతంత్ర్య చరిత్రలో ఆగష్టు 14 ను రక్తపు దినంగా అభివర్ణిస్తూ ఉంటారు. సర్వమతాల సమ్మేళనంగా ఉన్న అఖండ భారతావనిలో మతాల చిచ్చు రగులుకొని భారతదేశం రెండు రెండుగా చీల్చబడిన రోజు ఆగష్టు14. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతం పాకిస్తాన్ గా విడిపోతే, మనదేశం హిందూస్తాన్ గా మిగిలిపోయింది. అయితే దేశం ఇలా రెండు ముక్కలుగా విభజింపబడిన తరువాత మన దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పంజాబ్ సరిహద్దు కేంద్రంగా జరిగిన హింస మనదేశ చరిత్రలోనే ఎప్పటికీ చెరిగిపోని రక్తపు మచ్చ.
భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తరువాత కొత్తగా ఏర్పడిన సరిహద్దుకు రెండు వైపులా జరిగిన హింసలో రెండు లక్షలకు పైగానే మరణాలు నమోదు అయ్యాయి అంటే.. ఆ హింస ఎంత ఘోరమైనదో అర్థం చేసుకోవచ్చు. అందుకే మనకు స్వాతంత్ర్యం లభించిన ఆగష్టు 15 కు ఎంతటి ప్రత్యేకత ఉందో.. మనదేశం రెండు ముక్కలుగా చీల్చబడి ఘోరమైన హింసాఖండ కు ప్రతీకగా నిలిచిన ఆగష్టు 14 కూడా చరిత్రలో చెరిగిపోని మచ్చలా మిగిలిపోయింది.