వైఎస్ జగన్పై కత్తితో దాడి చేసిన ఘటన రోజుకొక మలుపు తిరుగుతోంది. కేసు విచారణను సిట్ ముమ్మరం చేసినసంగతి తెలిసిందే. ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించిన సిట్ నిందితుడినుంచి మరిన్ని ఆధారాలను రాబట్టింది. అయితే, కేసు తీవ్రత దృష్ట్యా వాటిని ఇప్పటికిప్పుడు బయట పెట్టలేమని సిట్ డీఎస్పీ అస్మి మీడియాకు తెలిపారు.
శ్రీనివాసరావును అన్ని కోణాల్లో విచారించామని చెప్పిన ఆయన, కొన్ని ముఖ్యమైన ఆధారాలు దొరికాయని తెలిపారు. దాడికి వాడిన కోడి కత్తిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని, రిపోర్టు అందాల్సివుందని వెల్లడించారు.కేసు దర్యాప్తులో భాగంగా వారం రోజుల నుంచి శ్రీనివాసరావును విచారించిన సిట్ కొన్ని కీలక ఆధారాలను సంపాదించింది.
అయితే ఇవాళ్టీతో అతని కస్టడీ గడువు పూర్తవుతుండటంతో శ్రీనివాస్ను విశాఖ సెంట్రల్ జైలుకు అప్పగించాల్సి వుంది. కేసు తీవ్రత దృష్ట్యా నిందితుడి కస్టడీని పొడిగించాలని సిట్ అధికారులు.. కోర్టును కోరే అవకాశం ఉంది. ఈ కేసులోని కీలక ఆధారాలను బయట పెట్టలేమని సిట్ చెబుతోంది.
శ్రీనివాసరావుకు నిజ నిర్ధారణ పరీక్షలు జరిపే ఆలోచనలో ఉన్నామని, అందుకు కోర్టు అనుమతిని కోరనున్నామని తెలిపారు.రేపటి నుంచి జరిగే జగన్ యాత్రకు ఎప్పటిలానే గట్టి బందోబస్తు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. శ్రీనివాసరావు మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తొలుత భావించామని, అయితే, వైద్యుల పరీక్షల తరువాత అతను బాగున్నాడనే నిర్ణయానికి వచ్చామని తెలిపారు.