నిదహాస్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్లో క్రీడాస్ఫూర్తి మరచి ప్రవర్తించిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్, రిజర్వ్ ప్లేయర్ నురుల్ హసన్లపై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడమే కాకుండా ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించింది.
ముక్కోణపు టీ20 టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో గొడవకి దిగిన బంగ్లాదేశ్ క్రికెటర్లపై ఐసీసీ చర్యలు తీసుకుంది. 160 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ విజయానికి చివరి 6 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి వచ్చింది.
బంగ్లాదేశ్ బ్యాటింగ్ చివరి ఓవర్లో మైదానంలో గందరగోళ పరిస్ధితి ఏర్పడిన విషయం తెలిసిందే. రెండు బంతులు భుజం కంటే ఎత్తులో వెళ్లినా అంపైర్లు నోబాల్ ఇవ్వకపోవడంపై బంగ్లా బ్యాట్స్మన్ అసహనానికి గురయ్యారు. ముస్తఫిజుర్ రనౌటైన గ్యాప్లో గ్రౌండ్లోకి వచ్చిన బంగ్లా రిజర్వ్ ప్లేయర్ నురుల్ శ్రీలంక కెప్టెన్ తిసారా పెరిరాతో వాగ్వాదానికి దిగాడు. అంపైర్లు కలగజేసుకుని సర్దిచెప్పేలోపే కెప్టెన్ షకీబ్ బౌండరీ దగ్గరకొచ్చి ‘బయటికి వచ్చేయండి..’ అంటూ గట్టిగా కేకలు వేశాడు
ఈ మ్యాచ్ చివరి ఓవర్లో మూడో బంతికి 4, ఆ తర్వాత 2, ఐదో బంతికి 6 బాదిన మహ్మదుల్లా బంగ్లాదేశ్కి 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. తాజాగా మైదానంలో గొడవపై విచారణ ప్రారంభించిన ఐసీసీ.. క్రమశిక్షణ తప్పి, క్రీడాస్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరించిన నూరుల్, షకిబ్ అల్ హసన్కి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ చర్యలు తీసుకుంది. వీరికి జరిమానాతో పాటు చెరొక డీమెరిట్ పాయింట్లు వారివారి ఖాతాలో చేరనున్నాయి.