టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా భారత జట్టులో ఉంటే.. కెప్టెన్ విరాట్ కోహ్లీకి అది లాభం చేకూరుస్తుందని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. కోల్కతాలో తాను రాసిన ‘ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో గంగూలీ పుజారాపై ప్రశంశల జల్లు కురపించారు.
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు టెస్టు జట్టులో చతేశ్వర్ పుజారా కూడా కీలక ఆటగాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఇద్దరికీ మెరుగైన రికార్డులున్నాయి. అయితే.. పుజారా ఆట చాలా భిన్నం. పాతతరం ఆటగాళ్ల తరహాలో క్రీజులో కుదుకున్న తర్వాత నెమ్మదిగా పరుగులు రాబట్టడం అతడి ఆట నైజం. ఈ కారణంగా అతను గెలిపించే ఇన్నింగ్స్లు ఆడుతున్నా.. కోహ్లీతో పోలిస్తే అతనికి సరైన గుర్తింపు లభించడం లేదన్నారు.
టెస్టు క్రికెట్లో అత్యంత కీలకమైనది మూడో స్థానంలో బ్యాటింగ్. ఓపెనర్లు విఫలమయితే కొత్త బంతిని పాతపడేవరకు ఆడి, తరువాత వచ్చే వారికి బ్యాటింగ్ సులభతరం చేయాలి. అలాంటి స్థానంలో వచ్చి అసాధారణ బ్యాటింగ్తో భారత క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన చతేశ్వర పుజారాను గుర్తించక పోవటం బాధాకరం అని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలి అభిప్రాయపడ్డారు. టెస్టు జట్టులో పుజారా మూడో స్థానంలో బ్యాటింగ్కి వస్తుండగా.. తర్వాత స్థానంలో కోహ్లికి బ్యాటింగ్కి వస్తుంటాడు.
ఇక ఐపీఎల్లో ఏ ఫ్రాంచైజీ ఈ టెస్ట్ బ్యాట్స్మన్ను తీసుకోకపోవడంతో మళ్లీ ఇంగ్లిష్ కౌంటీ జట్లలో ఒకటైన యార్క్షైర్ జట్టు తరుపున పుజారా ఆడనున్నాడు. ఆగస్టులో భారత్ ఇంగ్లండ్లో పర్యటించనున్న నేపథ్యంలో కౌంటీలు మేలు చేస్తాయని పూజారా భావిస్తున్నాడు.