శ్రీలంకతో ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఆరంభమైన చివరిదైన మూడో టెస్టులో భారత్ ఆదిలోనే వికెట్ను కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇన్నింగ్స్ను శిఖర్ ధావన్, మురళీ విజయ్లు ప్రారంభించారు. ఆరంభంలోనే శిఖర్ ధావన్ వికెట్ను కోల్పోయింది. 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శిఖర్ ధావన్ ఔట్ అయ్యాడు.
దిల్ రువాన్ పెరీరా వేసిన బంతిని ధావన్ స్వీప్ చేయగా… అది డీప్ బ్యాక్ వర్డ్ స్వేర్ దిశగా గాల్లోకి లేచింది. లక్మల్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. దిల్ రువాన్ కు ఇది 100వ టెస్ట్ వికెట్ కావడం గమనార్హం. మరోవైపు, అంపైర్ డ్రింక్స్ బ్రేక్ ప్రకటించాడు.
భారత ఓపెనర్ మురళీ విజయ్ (51; 67 బంతుల్లో 7×4) అద్భుత అర్ధశతకం సాధించాడు. మొదట్నుంచి నిలకడగా ఆడిన విజయ్ చక్కని కవర్ డ్రైవ్లు, స్క్వేర్ డ్రైవ్లతో అలరించాడు. అందివచ్చిన బంతుల్ని నేరుగా బౌండరీకి తరలించాడు. 26.2వ బంతికి ఓవర్త్రో రూపంలో ఐదు పరుగులు రావడంతో కెరీర్లో 16వ అర్ధశతకం పూర్తిచేశాడు.
అంతకు ముందు జట్టు స్కోరు 78 వద్ద టీమిండియా నయావాల్ ఛెతేశ్వర్ పుజారా (23; 39 బంతుల్లో 4×4) ఔటయ్యాడు. గమగె వేసిన 20.2వ బంతిని ఆడిన పుజారా లెగ్ గల్లీలో ఫీల్డర్ సమరవిక్రమకు చిక్కాడు. అతని నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన సారథి విరాట్ కోహ్లీ (17; 22 బంతుల్లో 3×3) వేగంగా ఆడుతున్నాడు. తనకే సొంతమైన సొగసైన కవర్డ్రైవ్లు బాదేశాడు. దీంతో భోజన విరామానికి, 27 ఓవర్లకు టీమిండియా 116/2తో నిలిచింది.