టి20 సిరీస్లో భారత్కు శుభారంభం లభించింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన తొలి టి20 మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్పై అతి కష్టం మీద విజయం సాధించింది. చివరికి 13 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుని మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యం సంపాదించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. అలెన్ (20 బంతుల్లో 27; 4 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్ల దెబ్బకు విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలింది. 16 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన విండీస్ ఆ తర్వాత కుదురుకోలేకపోయింది. ఆటగాళ్లు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. ఆదుకుంటారనుకున్న షిమ్రాన్ హెట్మయెర్ (10), కీరన్ పొలార్డ్ (14), డారెన్ బ్రావో (5) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు.
స్వల్ప లక్ష్యమే అయినా భారత్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. విండీస్ పేసర్ ఒషాన్ థామస్ దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతులు బ్యాట్స్మెన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రోహిత్ (6)ను ఔట్ చేసిన థామస్…తర్వాతి ఓవర్లో అద్భుత బంతితో ధావన్ (3)ను క్లీన్బౌల్డ్ చేశాడు. రిషభ్ పంత్ (1) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు.
అరుదుగా దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్లు కనిపించిన రాహుల్ (22 బంతుల్లో 16; 2 ఫోర్లు) భారీ షాట్కు ప్రయత్నించి వెనుదిరిగడంతో భారత్ 45 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఈ దశలో కార్తీక్, మనీశ్ పాండే (24 బంతుల్లో 19; 2 ఫోర్లు) కలిసి జాగ్రత్తగా ఆడారు. పొలార్డ్ ఓవర్లో కార్తీక్ మూడు ఫోర్లు కొట్టడం విశేషం. వీరిద్దరు ఐదో వికెట్కు 38 పరుగులు జోడించారు
తొలి మ్యాచ్ ఆడుతున్న కృనాల్ పాండ్యా (9 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు) దూకుడు ప్రదర్శిస్తూ కార్తీక్తో కలిసి మ్యాచ్ను ముగించాడు. వీరిద్దరు ఆరో వికెట్కు 17 బంతుల్లో అభేద్యంగా 27 పరుగులు జత చేశారు. తొలి టి20 మ్యాచ్లో భారత్ తరఫున ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. ఇప్పటికే ఆడిన 6 వన్డేల్లో 11 వికెట్లు తీసి ఆకట్టుకున్న లెఫ్టార్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్కు ఇది తొలి టి20 మ్యాచ్ కాగా… బౌలింగ్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు తొలిసారి భారత్ తరఫున ఆడే అవకాశం దక్కింది