సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ను చిత్తుగా ఓడించి అద్భుత విజయం సాధించింది కోల్కతా నైట్ రైడర్స్. విజయంపై కెప్టెన్ దినేశ్ కార్తిక్ స్పందించాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానె దూకుడు చూసి తాను వ్యూహం మార్చినట్లు కార్తీక్ వెల్లడించాడు. రాజస్థాన్ జట్టును మొదట కట్టడిచేసినా తర్వాత రహానే జోరు కొనసాగింది.
రహానే జోరును అడ్డుకోవడంలో మణికట్టు స్పిన్నర్లు విఫలమవుతున్న వేళ పార్ట్టైమ్ స్పిన్నర్ నితీశ్ రానాని రంగంలోకి దింపిన కార్తీక్. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్లో వరుసగా 4,4,4,4 బాదిన అజింక్య రహానె (36: 19 బంతుల్లో 5×4, 1×6) తర్వాత ఓవర్ వేసిన మావీ బౌలింగ్లోనూ ఓ సిక్స్ బాదేశాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ అతడ్ని ఏమాత్రం ఇబ్బందిపెట్టలేకపోయాడు. దీంతో.. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో నితీశ్ రానా చేతికి కార్తీక్ బంతినివ్వగా.. అతను ఐదో బంతికే రహానెని పెవిలియన్ బాట పట్టించాడు.
అప్పటికే క్రీజులో కుదురుకుని మిడిల్ ఓవర్లలో ధాటికి ఆడేందుకు ప్రయత్నించిన రాజస్థాన్ ఓపెనర్ డీఆర్క్ షార్ట్ (44: 43 బంతుల్లో 5×4, 1×6)ని ఔట్ చేసేందుకు రానానే కార్తీక్ వినియోగించాడు. అతను వేసిన బంతిని.. అర్థం చేసుకోలేక డీఆర్క్ షార్ట్ క్లీన్ బౌల్డయ్యాడు. ఈ మ్యాచ్లో కోల్కతా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. టోర్నీలో ఆ జట్టుకి ఇది మూడో విజయం కాగా.. వరుసగా రెండోది.