ఐపీఎల్ 2018 సీజన్లో తిరుగులేని ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్కి చేరింది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్లో చెన్నై 2 వికెట్ల తేడాతో విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది. సన్రైజర్స్ నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే 19.1 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇరు జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో సీఎస్కేనే పైచేయి సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు కార్లోస్ బ్రాత్వైట్ (43 నాటౌట్: 29 బంతుల్లో 1×4, 4×6) మెరుగ్గా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో షేన్ వాట్సన్ (0), సురేశ్ రైనా (22) అంబటి రాయుడు (0), ధోని (9), బ్రావో (7), జడేజా (3) పేలవ రీతిలో ఔటవడంతో.. చెన్నై ఒకానొక దశలో 62/6తో మ్యాచ్ని చేజార్చుకునేలా కనిపించింది. కానీ.. ఆఖర్లో దీపక్ చాహర్ (10), శార్ధూల్ ఠాకూర్ (15 నాటౌట్: 5 బంతుల్లో 3×4)తో కలిసి డుప్లెసిస్ సమయోచిత హిట్టింగ్తో చెన్నైకి 5 బంతులు మిగిలి ఉండగానే 140/8తో విజయాన్ని అందించాడు.
అంతకముందు సన్రైజర్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే శిఖర్ ధావన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత విలియమ్సన్తో కలిసి 34 పరుగులు జత చేసిన గోస్వామి(12) రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. మరో రెండు పరుగుల వ్యవధిలో కేన్ విలియమ్సన్(24) కూడా ఔట్ కావడంతో సన్రైజర్స్ 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరో 14 పరుగుల వ్యవధిలో షకిబుల్ హసన్(12) పెవిలియన్ చేరడంతో సన్రైజర్స్ మరింత ఇబ్బందుల్లో పడింది. ఆపై యూసఫ్ పఠాన్(24) ఫర్వాలేదనిపించడంతో సన్రైజర్స్ తిరిగి తేరుకుంది. కాగా, చివర్లో హిట్టర్ బ్రాత్వైట్(43 నాటౌట్; 29 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో సన్రైజర్స్ తేరుకుంది
ఓడిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. బుధవారం కోల్కతా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో శుక్రవారం ఈడెన్ గార్డెన్స్లో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనుంది. ఐపీఎల్ 2018 సీజన్లో చెన్నై చేతిలో హైదరాబాద్ ఓడిపోవడం ఇది వరుసగా మూడోసారి.