ప్రతిష్టాత్మక ప్రపంచకప్లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ బ్యాటింగ్ తీరుపై అభిమానులు, మాజీలు తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. టోర్నీలో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లాడిన మహీ 223 పరుగులు మాత్రమే చేశాడు. బెస్ట్ఫినిషర్గా పేరొందిన ధోనీ ఇప్పుడు జట్టుకు భారమయ్యాడు. విమర్శలతో సంబంధం లేకుండా విశ్వసమరం అనంతరం ధోనీ వీడ్కోలు పలికే ఛాన్స్ ఉందనె వార్తలు వస్తున్నాయి.
భారత్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన మిస్టర్ కూల్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఈ వరల్డ్ కప్ చివరిదా? టోర్నీ ముగియగానే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. 2011లో భారత్కు ప్రపంచకప్ సాధించిపెట్టిన ధోని.. ఏ కెప్టెన్కు సాధ్యం కాని ఘనతలు సాధించాడు. 2007 టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫి.. ఇలా ఎన్నో కప్లను భారత్ సొంతం చేశాడు. ఓడిపోయే స్థితిలో ఉన్న ఎన్నో మ్యాచ్లను ఒంటిచేత్తో గెలిపించి వరల్డ్ బెస్ట ఫినిషర్ అనిపించుకున్నాడు.కెప్టెన్ కాకపోయినా యువకులకు విలువైన సలహాలు ఇస్తూ వారు ప్రతిభావంతులుగా మారడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు.
మెగా టోర్నీలో టీమిండియా ఆడే ఆఖరి మ్యాచే ధోనీకి అంతర్జాతీయ క్రికెట్లో చివరిది కావొచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ భారత్ ఫైనల్ చేరి.. లార్డ్స్ మైదానంలో విశ్వవిజేతగా నిలిస్తే దిగ్గజ క్రికెటర్కు అదే వీడ్కోలు మ్యాచ్ కానుంది. వరల్డ్కప్ తర్వాత అతను కొనసాగే అవకాశాలు చాలా తక్కువ అంటూ బీసీసీఐ ప్రతినిధి చెప్పిన మాటలు అందుకు ఊతమిస్తున్నాయి. ప్రస్తుత సమయంలో కూడా అతడు ఎప్పుడు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఊహించడం చాలా కష్టమని ఆయన పేర్కొన్నాడు.
జట్టు క్లిష్టపరిస్థితులు, ఒత్తిడిలో ఉన్నప్పుడు ధోనీ అనుభవం అవసరమని, ఆ సమయంలో అతడు ఇచ్చే సలహాలు, సూచనలు భారత్కు ఎన్నోసార్లు ఉపయోగపడ్డాయని సెలక్టర్లు, ప్రధాన కోచ్ రవిశాస్త్రి, సారధి విరాట్ కోహ్లీ గతంలో చాలాసార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వస్తున్న విమర్శల నేపథ్యంలో ధోని రిటైర్ మెంట్ నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి.