ఏపీ సీఎం చంద్రబాబుపై భాజాపా అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. విభజన చట్టంలోని హామీలను 90శాతం అమలు చేశామని, అమరావతి, పోలవరానికి నిధులు ఇచ్చినా సరిగా ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం సహాయం చేసినా చేయలేదని దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. గురువారం రాజమండ్రిలో పర్యటించిన షా.. అర్బన్ జిల్లాల శక్తి కేంద్రాల సమ్మేళంలో పాల్గొన్నారు.
ఏపీకి ఐదేళ్లలో 20 ప్రతిష్ఠాత్మక సంస్థలు ఇచ్చామని, ఏపీ చరిత్రలో ఇన్ని ప్రాజెక్టులు ఎప్పుడూ రాలేదని తెలిపారు. గెయిల్, హెచ్పీసీఎల్ రూ. లక్ష కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ.4,500 కోట్ల పెట్టుబడులు.. కోస్తా ప్రాంతంలో రూ.55,475 కోట్లు కేంద్రం ఖర్చు చేస్తోందని చెప్పారు.
పుల్వామా ఉగ్రదాడిని బాబు రాజకీయం చేస్తున్నారని…కొందరు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. మాజీ ప్రధాని వాజ్పేయ్, ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచన చరిత్ర బాబు దన్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీని కూడా వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబుకు పాక్ ప్రధానిపై ఉన్న నమ్మకం.. మన ప్రధానిపై లేదని ధ్వజమెత్తారు. ఉగ్రదాడిని కాంగ్రెస్ రాజకీయం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్తో చంద్రబాబు కలిసి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు, జగన్లతో సాధ్యం కాదన్నారు. టీడీపీ, వైసీపీలు వారి కుటుంబ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నాయని.. రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలూ కుటుంబ, అవినీతి పార్టీలంటూ నిప్పులు చెరిగారు. అంతకు ముందు ఆయన రాజమండ్రిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.