తెలుగు సినీ పరిశ్రమలో ‘మా’ ఎన్నికల హీట్ కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి మద్దతుతో విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఇప్పటికే తన ప్యానెల్ను ప్రకటించారు. ప్రకాశ్రాజ్ ప్యానెల్లో మొత్తం చిరంజీవి అనుచరులే ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది. ఇక మంచు విష్ణు, జీవిత, హేమ పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. కానీ వారు ఇంకా ప్యానెల్ను ప్రకటించలేదు. ప్రకాశ్రాజ్ లోకల్ కాదంటూ విమర్శలు వస్తున్నాయి. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ మా అధ్యక్షుడు నరేశ్ మీడియాతో మాట్లాడారు. ’మా మసకబారిందని నిన్న నాగబాబు మాట్లాడారు. ఈ విషయం నన్ను ఎంతో బాధపెట్టింది. ఇక మహిళకు అవకాశం ఇవ్వాలని నేను కోరుతున్నాను. నేను కయ్యానికి కాలు దువ్వడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయలేదు. ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అని నేను అనలేదు. నన్ను చాలా రోజుల క్రితమే ప్రకాశ్రాజ్ సంప్రదించాడు. మంచు విష్ణు కూడా సంప్రదించాడు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. అయితే అందరికీ అందుబాటులో ఉండేవారిని ఎన్నుకోవాలి. ప్రస్తుతం మాలో పదవులు అనుభవిస్తున్నవారే హఠాత్తుగా ప్రకాశ్రాజ్ ప్యానెల్ చేరడం చూసి నేను షాక్ అయ్యాను’ అంటూ ఆయన పేర్కొన్నారు.
అనంతరం కరాటే కల్యాణి మాట్లాడుతూ.. ప్రకాశ్రాజ్పై విరుచుకుపడ్డారు. ‘ప్రకాశ్రాజ్కు స్త్రీలంటే గౌరవం లేదు. అటువంటి వ్యక్తికి మేము ఎందుకు సపోర్ట్ చేయాలి’ అంటూ ఆమె విరుచుకుపడ్డారు. మొత్తానికి మా ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ప్రకాశ్రాజ్ మాత్రం.. మీడియా అనవసరంగా ఈ వ్యవహారాన్ని హైలెట్ చేస్తుందని .. ఇందులోకి రాజకీయాలను లాగుతున్నారని వాపోయారు.
Also Read