బాలీవుడ్ తనను భరించలేదంటూ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యలపై రియాక్షన్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి. అడవి శేషు నటించిన మేజర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొన్న మహేశ్ బాబు ఆ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను టాలీవుడ్ను వదిలి వెళ్లననీ.. బాలీవుడ్ తనను భరించలేదంటూ కామెంట్ చేశారు. బాలీవుడ్కు వెళతారా అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మహేశ్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పైగా ఆ పని చేసి తాను టైం వేస్ట్ చేసుకోలేనని అన్నారు.
మహేశ్ బాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. అయితే మహేశ్ వ్యాఖ్యలకు కొందరు ప్రముఖుల నుంచి మాత్రం మద్దతు లభిస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేంటి అంటున్నారు. తాజాగా కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఈ వ్యవహారంపై స్పందించింది. ఏ విషయంపైన అయినా తనదైన శైలిలో స్పందించే కంగన మహేశ్ బాబు సరిగ్గానే మాట్లాడారంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.
ఎంతో మంది దర్శకుల నుంచి మహేశ్ కు చాలా ఆఫర్స్ రావడం తనకు తెలుసునని గుర్తు చేసింది. తెలుగు సినిమాను అగ్ర స్థానంలో నిలబెట్టిన నటుడు మహేశ్ ను బాలీవుడ్ భరించలేదన్నది నిజమేనని కామెంట్ చేసింది. అయితే ఏ సందర్భంలో మహేశ్ బాబు ఆ వ్యాఖ్యలు చేశారో.. తనకు తెలీదని వ్యాఖ్యానించింది. పది, పదిహేడేనేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమ వెలిగిపోతోందనీ.. వారి నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి ఉందని కంగనా చెప్పింది. ఏ భాషా మరో భాష కంటే తక్కువా కాదు… ఎక్కువా కాదని కంగనా రనౌత్ వ్యాఖ్యానించింది.