కరోనా ఎఫెక్ట్తో థియేటర్లు మూతపడ్డాయి. త్వరలో థియేటర్లు తెరుచుకొనే చాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్ల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. ప్రస్తుతం లాక్డౌన్ ఎత్తేసినా థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకొనే పరిస్థితి లేదు. మరోవైపు ఓటీటీలు థియేటర్ల పాలిట శాపంగా మారాయి
ఈ నేపథ్యంలో థియేటర్ల విషయంపై ఒక్కో నటుడు గొంతు విప్పుతున్నారు. నిన్న నేచురల్ స్టార్ నానీ థియేటర్ల తెరుచుకొనేందుకు ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వాలు.. థియేటర్ టికెట్ల విషయంలో ఎందుకుంత కఠినంగా ఉంటున్నాయని ఆయన ప్రశ్నించారు.
తాజాగా ఓటీటీ విషయంపై పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్పందించారు. విజయవాడలోని ఐలాపురంలో రైతు సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటీటీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి నిజమే. కానీ పేద, మధ్య తరగతి ప్రజలకు వినోదం అందించాల్సిన బాధ్యత కూడా మనమీద ఉంది కదా. ఇటీవల నారప్ప అనే సినిమా ఓటీటీలో విడుదలైంది. మంచి టాక్ తెచ్చుకుంది.
అయితే ఈ సినిమాను కేవలం 25 శాతం మంది ప్రేక్షకులు మాత్రమే చూశారు. మిగిలిన 75 శాతం మంది చూడలేదు. అందుకు కారణం వారికి ఓటీటీలో అందుబాటులో లేదు. థియేటర్ అంటే ఓ సందడి. థియేటర్లో సినిమాలు చూడటం ఓ ఆనందం. దాన్ని ప్రేక్షకులకు దూరం చేయకూడదు. ఈ విషయంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం జోక్యం చేసుకోవాలి’ అంటూ ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యానించారు.
Also Read : థియేటర్లపై ఎందుకీ ఆంక్షలు.. నానీ సంచలన వ్యాఖ్యలు