కరోనా ఎఫెక్ట్ తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లు మూత పడ్డ విషయం తెలిసిందే. కరోనా మొదటివేవ్లోనూ థియేటర్లు క్లోజ్ అయ్యాయి. ఆ తర్వాత నిబంధనలు ఎత్తేసిన వెంబడే మళ్లీ తెరిచారు. అయితే కరోనా సెకండ్వేవ్లో థియేటర్లు మళ్లీ మూత పడ్డాయి. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం థియేటర్లు తెరుచుకొనేందుకు అనుమతి ఇచ్చింది. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవచ్చని చెప్పింది. అయినప్పటికీ థియేటర్ యజమానులు మాత్రం తెరవడం లేదు. లాక్డౌన్తో తామెంతో నష్టపోయామని వారు అంటున్నారు. ప్రభుత్వం విద్యుత్ బకాయిలు మాఫీ చేయాలని కోరుతున్నారు.
అయితే తెలంగాణ ప్రభుత్వం థియేటర్ యజమానులు చేసిన కొన్ని డిమాండ్లను ఒప్పుకున్నది. పార్కింగ్ ఫీజు వసూలు చేసుకొనేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. అయినప్పటికీ థియేటర్లు ఓపెన్ చేసి.. సినిమాలు విడుదల చేసేందుకు యజమానులు జంకుతున్నారు. అందుకు ప్రధాన కారణం ఓపెనింగ్స్ వస్తాయో? రాదో? అని వారిలో టెన్షన్ పట్టుకున్నట్టు సమాచారం. అంతేకాక.. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదల చేయడం పట్ల కూడా థియేటర్ యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిర్మాతలు మాత్రం.. లాభాలు చూసుకొని సినిమాలను ఓటీటీలకు అమ్మేసుకుంటున్నారు.
త్వరలో విడుదల అయ్యే సినిమాల్లో ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. దీంతో థియేటర్ యజమానులు ఆలోచనలో పడ్డారు. పెద్ద సినిమా విడుదలైతే ప్రేక్షకులు భారీ సంఖ్యలో థియేటర్లకు వస్తారని.. అలాగే అలవాటు పడతారని థియేటర్ ఓనర్స్ భావిస్తున్నారట. మరోవైపు కరోనా భయంతో జనాలు థియేటర్ లకు వస్తారో? రారో? అన్న ఆందోళన కూడా వారిని వేధిస్తున్నది. ఇక భారీ బడ్జెట్ సినిమాలు సైతం ఓటీటీలో విడుదలవుతుండటంతో వారు భయపడుతున్నారు. కాగా, జూలై 30 న థియేటర్లు తెరుచుకొనే అవకాశం ఉందని సమాచారం.
Also Read