జిల్లాలోని ఆలురూ మండలం హత్తిబెళగల్ వద్ద శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. క్వారీలో జరిగిన భారీ పేలుడు తరువాత మరణించిన వారి సంఖ్య 12కు పెరిగింది. మరో నలుగురు మృత్యువుతో పోరాడుతున్నారు. గాయపడిన వారికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
క్వారీలో ఇంత భారీ పేలుడుకు కారణాన్ని పోలీసులు కనుగొన్నారు. రాళ్ల మధ్య భారీ మొత్తంలో జిలెటిన్ స్టిక్స్ తో పాటు కెమికల్స్ కూడా వాడినందు వలెనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు గుర్తించారు
సాధారణంగా బండరాళ్లను పేల్చేందుకు వినియోగించే డిటొనేటర్లు ఒకదాని తరువాత ఒకటి పేలుతుంటాయి. పేలుడు జరిగే ప్రాంతానికి దూరంగా వెళితే ఎటువంటి ప్రమాదమూ ఉండదు. కానీ ఈ క్వారీలో జరిగింది వేరు. రాళ్లను ముక్కలు చేసేందుకు తెచ్చిన పేలుడు పదార్థాలను ఆ ప్రాంతంలో భారీగా నిల్వ ఉంచారు. మూడు వందలకు పైగా ఎలక్ట్రికల్ డిటొనేటర్లు, కిలోల కొద్దీ గన్ పౌడర్, సెమీ ఎక్స్ ప్లోజివ్స్, జిలెటిన్ స్టిక్స్ అక్కడ ఉన్నాయి.
ఈ క్వారీలో ఇటీవల కొన్ని చోట్ల పేలుళ్లు జరుపగా, కొన్ని డిటొనేటర్లు, గన్ పౌడర్ పేలలేదు. వాటిని అక్కడి నుంచి క్వారీ యాజమాన్యం తొలగించలేదు. ఆపై నిన్న రాత్రి కూలీలు వంట నిమిత్తం తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు చెలరేగాయి. ఆ మంటలు డిటొనేటర్ల వైర్లకు అంటుకున్నాయి. ఆ సమయంలో ఏర్పడిన పేలుడుతో అప్పటికే గుంతల్లో అమర్చిన డిటొనేటర్లకూ మంటలు అంటుకుని, అవి కూడా పేలడం, గన్ పౌడర్ ఎగసిపడటంతో ప్రమాద తీవ్రత అత్యధికంగా ఉందని అధికారులు అంటున్నారు.
ప్రమాదం జరిగిన హత్తిబెళగల్ క్వారీ శ్రీనివాస్ సుహాస్ అనే వ్యక్తికి చెందినదని తెలుస్తోంది. కాగా క్వారీ యజమానులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మృతులకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు కలెక్టర్ సత్యనారాయణ చెప్పారు. మృతులు అందరూ ఒడిశా, చత్తీస్ఘడ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులుగా గుర్తించారు,