టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్కి ఈ రెండు రోజులు కీలకమేనా…ఓ వైపు బాబు క్వాష్,బెయిల్ పిటిషన్ మరోవైపు లోకేష్ విచారణ,కస్టడీ నేపథ్యంలో ఏం జరుగుతుందా అని టీడీపీ నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రధానంగా సుప్రీం కోర్టు ముందుకు చంద్రబాబు క్వాష్ మంగళవారం విచారణకు రానుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదైన కేసులను కొట్టేయాలని దాఖలు చేశారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని నారా ఫ్యామిలీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక బుధవారం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్తో పాటు మాజీ మంత్రి నారాయణను విచారించనుంది. న్యాయస్ధానం సైతం అక్టోబర్ 4 వరకు లోకేష్ని అరెస్ట్ చేయవద్దని సూచించడం, అదేరోజు విచారణ ఉండటంతో కస్టడీలోకి తీసుకుంటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్ర పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను అక్టోబర్ 4న విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. దీనికి తోడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ 4న విచారణకు రానుంది. అంగళ్లు అల్లర్ల కేసులోను బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా పడగా.. ఇదే కేసులో అక్టోబర్ 4కు లోకేష్ పిటిషన్ను వాయిదా వేసింది హైకోర్టు. మొత్తంగా బెయిల్ కోసం చంద్రబాబు తరపు లాయర్లు విశ్వప్రయత్నాలు చేస్తుండగా అది ఇప్పట్లో సాధ్యపడేలా కనిపించడం లేదు.