విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి దూరమైన సంగతి తెలిసిందే. రెండుసార్లు విజయవాడ నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన నాని ఈ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావించారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబుతో గ్యాప్ ఏర్పడటం అది చివరకు టికెట్ కోత విధించే వరకు వెళ్లింది. దీంతో ఆగ్రహించిన నాని త్వరలోనే ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించడమే కాదు తన కూతురు, టీడీపీ కార్పొరేటర్ శ్వేతతో రాజీనామా కూడా చేయించారు.
ఇక త్వరలోనే టీడీపీకి రాజీనామా చేయనున్న నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రౌండ్ ప్రీపేర్ చేసుకుంటున్నారు. అయితే నాని అడుగులు వైసీపీ వైపు పడటం ఖాయంగా కనిపిస్తోంది. అన్నిఅనుకున్నట్లు జరిగితే వచ్చే రెండు వారాల్లో నాని..వైసీపీలో చేరడం స్పష్టమని తెలుస్తోంది. వైసీపీ తరపున విజయవాడ ఎంపీగా నాని బరిలో ఉంటారని సమాచారం.
వాస్తవానికి విజయవాడ ఎంపీ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ నేతలతో నానికి మంచి సంబంధాలున్నాయి. ఇవికూడా నాని వైసీపీలో మార్గం మరింత సుఖుమం చేశాయి. దీనికి తోడు 2019లో ఇక్కడ వైసీపీ నుండి పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) తర్వాత పార్టీకి దూరం కావడంతో నానికి మరింత కలిసి వచ్చింది. ఇప్పటికే వైసీపీ నేతలు నానితో మాట్లాడగా ఆయన కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తంగా నాని వైసీపీలో చేరితే విజయవాడ ఎంపీ సీటు జగన్ ఖాతాలో పడటం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.