కొత్తపేట…ఉభయ గోదావరి జిల్లాలో కీలక నియోజకవర్గం. వైసీపీ ఆవిర్భావం తర్వాత రెండు సార్లు ఆ పార్టీనే విజయం సాధించింది. ఇక ఈ సారి కూడా వైసీపీదే విజయమని అంతా భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకూ 7 సార్లు కాంగ్రెస్ విజయం సాధించగా,4 సార్లు టీడీపీ, 2 సార్లు వైసీపీ, ఒకసారి జనతాపార్టీ, ఒకసారి ప్రజారాజ్యం గెలుపుబాట పట్టాయి.
1999 టీడీపీ తరపున, ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం తరపున విజయం సాధించారు బండారు సత్యానందరావు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి చిర్ల జగ్గిరెడ్డి గెలుపొందగా ఈసారి వైసీపీ తరుపున చిర్ల జగ్గిరెడ్డి, కూటమి తరుపున టీడీపీ అభ్యర్థిగా బండారు సత్యానంద రావు బరిలోకి దిగుతున్నారు.
కొత్తపేటలో కాపు సామాజికవర్గ ఓటర్లు 68 వేలు,ఎస్సీలు 45వేలు, బీసీల్లో శెట్టిబలిజలు 39 వేలు, రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు 16వేలు ఉన్నారు. గత పది సంవత్సరాల్లో తాను చేసిన అభివృద్ధికి తోడు, వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమం తనను గట్టెక్కిస్తుందని ధీమాతో ఉన్నారు జగ్గిరెడ్డి. అయితే ఎవరు గెలిచినా మూడోసారి గెలిచినట్టే కానున్న నేపథ్యంలో విజయం ఎవరిని వరిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.