ఇవాళ్టి నుండి జనంలోకి వెళ్లనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అయితే పవన్ పర్యటన బాగానే ఉన్నా పార్టీ నుండి పోటీ చేసే మిగితా ముగ్గురు అభ్యర్థుల సంగతేంటా? అని ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీ నేతలు.
పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు కేటాయించగా 18 అసెంబ్లీ,1 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అయితే మిగితా మూడు అసెంబ్లీ స్థానాలకు, ఒక ఎంపీ స్థానానికి మాత్రం అభ్యర్థులను ఇంతవరకు ప్రకటించలేదు పవన్.
విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లతో పాటు బందరు పార్లమెంట్ స్థానాన్ని పెండింగ్లో పెట్టారు. ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఎలాంటి క్లారిటీకి రాలేకపోతున్నారు పవన్. బందరు నుండి ఎంపీ వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న అఫిషియల్ ప్రకటన మాత్రం రావడం లేదు. తనకు పవన్ సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంటుగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు బాలశౌరి.
ఇక విశాఖ సౌత్ విషయానికొస్తే కార్పొరేటర్లు సాధిక్, కందుల నాగరాజు,మూగి శ్రీనివాస్,వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్లను పరిశీలిస్తుండగా ఎవరికి సీటు ఇచ్చినా మిగితావారు సహకరించే పరిస్థితి లేదు. అవనిగడ్డ సీటు కోసం విక్కుర్తి శ్రీనివాస్, బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ, పాలకొండ స్థానానికి ఏకంగా ఆరుగురు పోటీ చేస్తుండటంతో అభ్యర్థుల ఎంపిక పవన్కు తలనొప్పిగా మారింది. దీనిపై జనసేన నాయకులు తీవ్ర ఒత్తిడి తెస్తుండగా పవన్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మొత్తంగా జనసేన మిగితా అభ్యర్థుల ప్రకటన ఎప్పుడని ఆ పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.