సినీనటుడు శివాజీ మరో ట్విస్ట్ను తాజాగా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ వర్గీయులుగా ముద్రున్న కొన్ని సంస్థలపై కేంద్ర ఐటీ సంస్థ ముమ్మరంగా దాడులను చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ దాడులకు రూపకల్పన చేసింది.. రాష్ట్రానికి చెందిన ఓ మహిళా మణి అంటూ శివాజీ వెళ్లడించారు. దీంతో ఎవరా మహిళా మణి అనే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. సినీనటుడు శివాజీ ఏపీలో జరగబోయే ఐటీ దాడులు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వంపై బీజేపీ ప్రభుత్వం చేయబోయే కక్ష సాధింపులకు సంబంధించి ముందుగానే లీకులు ఇస్తూ వస్తున్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగా త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పుడో ఎక్కడో జరిగిన ఓ చిన్న ఉద్యమానికి సంబంధించి కోర్టు నోటీసులు రాబోతున్నాయని శివాజీ ప్రకటించిన.. రెండు రోజులకే వచ్చాయి. అలాగే.. ఐటీ దాడులకు సంబంధించి కూడా శివాజీ ముందే లీకు ఇచ్చారు. చెప్పినట్టుగానే రాష్ట్రంలో ఐటీ దాడుల హడావుడి ఆరంభమైంది. రాత్రికి రాత్రి ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ర్ట రాజధాని విజయవాడ, గుంటూరు సహా శ్రీకాకుళం వరకూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండే కొన్ని సంస్థలపై ముమ్మరంగా దాడులు చేశారు. విజయవాడకు రాత్రి 10గంటలకు చేరుకున్న శివాజీ.. మరో బాంబును పేల్చారు. ఈ దాడుల రూపకల్పన చేసింది.. రాష్ట్రానికి చెందిన ఓ మహిళా మణి అంటూ.. బాంబు పేల్చారు. సదరు మహిళా మణి ఎవరంటే మాత్రం శివాజీ.. మాట దాటవేశారు. సదరు మహిళా మణి.. మహాతల్లి అంటూ ఒత్తి మరీ పలుకుతూ మరో ముగ్గురు కలిసి.. రెచ్చగొట్టి ఐటీ అధికారులను రాష్ట్రంపైకి పంపించారంటూ వెళ్లడించారు. దీంతో ఇప్పుడు ఈ మహిళా మణి ఎవరనేది శోధించే పనిలో అటు మీడియా.. ఇటు ప్రజలు పడ్డారు.
ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. పెద్దగా చెప్పుకోదగ్గ మహిళా నాయకులు ఎవరూ ఆ పార్టీలో లేరు. అక్కడ, ఇక్కడా చూసుకుంటే పురంధరేశ్వరి, నిర్మళా సీతారామన్ తప్ప మరో పెద్ద నాయకురాలు బీజీపీలో లేరు. అదికూడా శివాజీ స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా మణి అంటూ.. చెప్పడంతో పురంధరేశ్వరి ఒక్కరే కనిపిస్తున్నారు. బీజేపీలో చేరిన పురంధేశ్వరి ఆ పార్టీలో తన స్థానం పదిలం చేసుకునే పనిలో గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా తనకే అవకాశం వస్తుందని కూడా భావించారు. కానీ.. అనూహ్యంగా బీజేపీ సమీకరణాల నేపథ్యంలో పార్టీని మారడానికి సిద్ధమైపోయిన కన్నా లక్ష్మినారాయణను తెచ్చి పీఠంపై కూర్చోబెట్టారు. దీనిపై పురంధేశ్వరి చాలా అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆమెను బుజ్జగించే ప్రయత్నాలను కేంద్రంలోని బీజేపీ పెద్దలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును అడ్డుతొలగించుకుంటే.. రాబోయే బీజేపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టే అవకాశం ఉందని పురంధరేశ్వరికి పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ లెక్కలన్నీ చూసుకుంటే.. ఢిల్లీలో కూర్చుని రాష్ట్రంలోని రాజకీయాలను శాసించే స్థాయి ఇంకెవరికీ కనిపించడం లేదు. అయితే.. సదరు మహిళా మణి ఎవరనేది శివాజీ బయటపెడితే తప్ప.. పురంధరేశ్వరా.. లేక ఇంకెవరైనా ఉన్నారా.. అనే విషయంలో స్పష్టత వస్తుంది.