ఆయన మాటలు వింటుంటే… ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజులైందేమో అనిపిస్తుంది! ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి నెల రోజులు కూడా దాటలేదేమో అనిపిస్తోంది! అదేనండీ… ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్య చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు విన్న ఎవరికైనా ఇలానే అనిపిస్తుంది. అధికారం చేపట్టి రెండేళ్లు గడిచింది.
ఒక పక్క ఉత్సవాలు కూడా భారీగానే జరుపుకుంటున్నారు. భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. కానీ, నిన్నోమొన్నో అధికార పీఠం ఎక్కినట్టు చంద్రబాబు వ్యాఖ్యానిస్తూ ఉండటం విచిత్రం అనే చెప్పుకోవాలి. గత ఎన్నికల్లో ప్రజలు తనని ఎందుకు ఎన్నుకున్నారంటే… అనే అంశంపై చంద్రబాబు మరోసారి మాట్లాడారు! రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందనీ… ఇలాంటప్పుడు ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే స్టేట్ని ఉద్ధరించగలరని ప్రజలు భావించి తనని ఆశ్వీరించారని ఆయన చెప్పారు.
ఈ రెండేళ్లలో ఎన్నో సమస్యలు వచ్చాయని, వాటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొన్నామని చెప్పారు. ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా హుద్హుద్ తుఫాను వచ్చిందన్నారు. ఆ సమయంలో తాను ఒక్క పిలుపు ఇస్తే ప్రజలు స్పందించారన్నారు. బస్సులో ఎనిమిది రోజలుపాటు ఉండి, విశాఖలో పరిస్థితులు మామూలు స్థితికి వచ్చే వరకూ కృషి చేశాను అన్నారు. ఈ ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే దక్కుతుందన్నారు. విశాఖలో దీపావళినాడు ఒక్క టపాసు కూడా కాల్చొద్దని తాను పిలుపునిచ్చాననీ, వెంటనే ప్రజలు స్పందించి ఒక్క టపాసు కూడా కాల్చలేదన్నారు. ప్రజలకు తనపై ఉన్న నమ్మకం అదీ అని చెప్పుకోచ్చారు.
సందర్భం ఏదైనా కావొచ్చు… వేదిక మరేదైనా కావొచ్చు… ఇదే విషయాన్ని గడచిన రెండేళ్లలో ఎన్నోసార్లు చెప్పారు చంద్రబాబు. అయినా, విపత్తు నివారణ చర్యల్ని కూడా ప్రభుత్వం సాధించిన విజయంగా అభివర్ణించుకోవడం ఏంటో..? ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు నాయకుడిగా ప్రజల కష్టాలను తీర్చాల్సిన బాధ్యత ఆయనది. విధి నిర్వహణను కూడా వితరణగా ప్రచారం చేసుకోవడం ఏంటో..? రెండేళ్లు గడిచినా కూడా… తనపై నమ్మకంతో ప్రజలు అవకాశం ఇచ్చారని పదేపదే చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది..?