సీబీఐ కొత్త బాస్గా రిషి కుమార్ శుక్లా నియమితులయ్యారు. ఎన్నో వడపోతలు.. చర్చోపచర్చల అనంతరం ఆయన పేరుకు ఒకే చెప్పింది సెలక్షన్ కమిటీ. ఇంతకీ ఈ కమిటీలో ఎవరున్నారో తెలుసా? ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే. ఒకరికి ఒక పేరు నచ్చితే.. మరోకరికి మరో పేరు నచ్చదు. సీబీఐ చీఫ్ నియామకాన్ని ఇంత రాజకీయంగా మార్చేస్తారా? అన్న ప్రశ్నలు.. సీబీఐకి కొత్త బాస్ ను డిసైడ్ చేయటంలో ఇంత ఆలస్యం ఏమిటంటూ సుప్రీంకోర్టు ఆక్షింతల అనంతరం మొత్తానికి అనేక చర్చల అనంతరం మధ్యప్రదేశ్ డీజీపీగా పనిచేసిన శుక్లా పేరుకు టిక్ పెట్టింది సెలక్షన్ కమిటీ.
శుక్లా ఎంపికకు ముందు దాదాపు 80 మంది అభ్యర్థుల పేర్లను పరిశీలించారు. వారిలో 30 మందితో కూడిన జాబితాను షార్ట్ లిస్ట్ చేసి ప్రధానికి.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి.. లోక్ సభలో విపక్ష నేతకు పంపారు.
ఇందులో కూడా మెజారీటి ప్రకారం.. విపక్ష నేత మల్లికార్జున ఖర్గే సూచించిన అధికారికి కాకుండా ప్రభుత్వం మెచ్చిన రిషికుమార్ కు సీబీఐ పగ్గాలు చేతికి అందించారు. మధ్యప్రదేశ్ క్యాడర్ కు చెందిన శుక్లాకు.. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంతో పడదన్న పేరుంది. రానున్న రెండేళ్ల పాటు సీబీఐ బాస్ పదవిని నిర్వహించనున్న శుక్లా బ్యాక్ గ్రౌండ్లోకి వెళితే.. ఆయన గ్వాలియర్ నివాసి. తత్వ శాస్త్రంలో పీజీ చేసిన ఆయన.. 1983 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. గతంలో మధ్యప్రదేశ్ డీజీపీగా వ్యవహరించిన ఆయన.. ఇటీవలే ఆయన్ను రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థకు ఛైర్మన్ గా ఎంపిక చేశారు.
ఎక్కువగా మాట్లాడరన్న పేరుతో పాటు..రూల్ ప్రకారమే ముందుకెళతారన్న పేరుంది. మధ్యప్రదేశ్ లోని శివరాజ్ సింగ్ చౌహాస్ సీఎంగాఉన్న వేళ.. సర్కారుతో శుక్లా ఘర్షణ పడినట్లుగా చెబుతారు. కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చినంతనే ఆయన్ను డీజీపీ పదవి నుంచి అప్రాధాన్యత పోస్ట్కు పంపారు. అలాంటి ఆయనను సీబీఐ చీఫ్ గా ఎంపిక చేయటం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఇదిలా ఉంటే.. రుషికుమార్ శుక్లా నియామకాన్ని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు. సీబీఐ చీఫ్ ఎంపికకు సీనియారీటి ఒక్కటే సరిపోదని.. అవినీతి కేసుల్ని విచారించటంతో అనుభవం లేదని ఆయన ఫైర్ అయ్యారు. మరి కొత్త బాస్ పనితనం ఎలా ఉండనుందో మరి కొన్ని రోజుల్లో తేలనుంది. ఏమీ చేసిన సీబీఐ అనేది కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థ అనే ఎప్పుడో పడిపోయింది.