నవరత్నాలు.. జగన్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన పథకాలు. ఎన్నికష్టాలు ఎదురయినా ఆ పథకాలను అమలు చేయాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. ఎక్కడా అవినీతికి ఆస్కారంలేకుండా పథకాలు ప్రజలకు చేరాలని సమర్థులైన అధికారులతో కొత్త టీమ్ను తయారు చేసుకున్నారు. మ్యానిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావిస్తామని ఇప్పటికే జగన్ ప్రకటించని సంగతి తెలిసిందే.సెక్రటేరియట్ లోని తన పేషీలో ఈ నవరత్నాల హామీలపై ప్రత్యేక పోస్టర్లు తయారు చేయించి పెట్టుకున్నారు.
తాజాగా నవరత్నాలు అమలు కోసం ప్రత్యేకంగా జగన్ ఓ అధికారిని నియమించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం. శామ్యూల్ ను జగన్ నవరత్నాల పథకాల అమలు కోసం ప్రత్యేక సలహాదారు హోదాలో నియమించారు. ఈ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సలహాదారుగా నియమితులయ్యారు. నవరత్నాల కార్యక్రమానికి వైస్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్కు కేబినెట్ హోదాతో పాటు మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.
మూడు సంవత్సరాల తర్వాత కూడా శ్యామ్యూల్ ను ఆయన పనితీరు బట్టి కొనసాగించే అవకాశం ఉంది. మాజీ ఐఏఎస్ అధికారి కావడంతో నవరత్నాల పథకాల అమలు- వాటిలో వచ్చే ఇబ్బందులపై శ్యామ్యూల్ కు మంచి అవగాహన ఉంటుంది. దీన్ని బట్టి చూస్తె నవరత్నాల పథకాలను అమలుపై జగన్కు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.