కరోనా నివారణకు మన మందున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. అయితే వ్యాక్సిన్ ల తయారీ, పనితీరు, భద్రతపై తొలి నుంచి అనేక అనుమానాలు నెలకొన్నాయి. వ్యాక్సిన్లు హడావుడిగా తయారుచేశారని.. ఏళ్లకు ఏళ్లు పరిశోధించి బయటకు తీసుకురావాల్సిన వ్యాక్సిన్లను కేవలం సంవత్సరం లోపే మార్కెట్లోకి తీసుకొచ్చారని కొందరు నిపుణులు అంచనా వేశారు. మనదేశంలోనూ భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాక్జిన్, ఆక్స్ఫర్డ్ సహకారంతో సీరం ఇన్స్టిట్యూట్ తయారుచేసిన కోవిషీల్డ్ అందుబాటులోకి వచ్చాయి.
అయితే తొలుత ఈ వ్యాక్సిన్లు వేయించుకొనేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ కరోనా సెకండ్ వేవ్ అనంతరం ప్రస్తుతం వ్యాక్సిన్ల కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే కోవాక్జిన్ పనితీరుపై మొదటి నుంచి కొన్ని అనుమానాలు నెలకొన్నాయి. ఈ వ్యాక్సిన్కు మూడో దశ ట్రయల్స్ పూర్తికాకపోవడం.. డబ్ల్యూహెచ్వో నుంచి గుర్తింపు రాకపోవడంతో దీని పనితీరుపై అనుమానాలు నెలకొన్నాయి. అయినా కోవాక్జిన్ పంపిణీ మాత్రం కొనసాగుతోంది.
తాజాగా ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన ఓ సానుకూల అంశం బయటకు వచ్చింది. కోవాక్జిన్ టీకా కరోనాపై 77.8 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని నిపుణుల కమిటీ తేల్చినట్టు సమాచారం. ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్కు సంబంధించిన ఫలితాలను డీసీజీఐకి చెందిన ఎక్స్పర్ట్ కమిటీకి సమర్పించింది. అయితే మూడో దశ ప్రయోగాల్లో కోవాగ్జిన్ సామర్థ్యం 77.8 శాతంగా తేలిందని తెలుస్తోంది.
Also Read
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. 27 మందికి కోవిషీల్డ్ కు బదులుగా కోవాక్సిన్..!