ఏపీలో కర్ఫ్యూ మరికొన్ని రోజులు పొడిగించబోతున్నట్టు సమాచారం. ఈ నెల 20వ తేదీ వరకు ఏపీలో కర్ఫ్యూ అమల్లో ఉంది. అయితే ఆ తర్వాత కూడా కొన్ని సడలింపులతో కర్ఫ్యూ పొడిగించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాలని కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ సంప్రదింపులు జరుపుతున్నారు.
పరీక్షలు రద్దు చేయాలంటూ ఓ వైపు ప్రతి పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.. అయినప్పటికీ పరీక్షల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నది. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రభుత్వం అంటున్నది. ఇదిలా ఉంటే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఏపీలో కర్ఫ్యూ విధించారు. కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ .. థర్డ్వేవ్ వస్తుందంటూ నిపుణులు హెచ్చరిస్తుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మరికొంత కాలం పాటు ఆంక్షలు విధించాలని భావిస్తున్నది.
ప్రస్తుతం విధించిన ఆంక్షలు ఈ నెల 20తో ముగిసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఇవాళ సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జూన్ 20 వరకూ కర్ఫ్యూ ఉంటుందని చెప్పాం.. తర్వాత కర్ఫ్యూలో కొన్ని సడలింపులు ఇవ్వాల్సి ఉంటుంది’ అని చెప్పారు. మరోవైపు జూన్ 22న చేయూత పథకం అమలుకు కలెక్టర్లు సిద్ధం కావాలని సూచించారు. జులైలో విద్యాదీవెన, కాపు నేస్తం పథకాలు అమలుచేయనున్నట్టు వెల్లడించారు. అయితే కర్ఫ్యూ ఎప్పటివరకు పొడిగిస్తారు. ఎటువంటి సడలింపులు ఇస్తారు? అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
Also Read