త్వరలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపధ్యంలో దేశవ్యాప్తంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా తెలంగాణా సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. ఎన్నికల్లో కేంద్రంలో ఏపార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదని హంగ్ ఏర్పాటు అవుతుందనే సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. హంగ్ ఏర్పడే సమయంలో ప్రాంతీయ పార్టీలు ముఖ్యం కానున్నాయి. కాంగ్రెస్, భాజాపాలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దీనిలో భాగంగా డీఎమ్కే అధ్యక్షుడు స్టాలిన్తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
ఫెడరల్ఫ్రంట్ ఏర్పాటులో ప్రాంతీయపార్టీల మద్దతు కూడగట్టేందుకు రాష్ర్టాల పర్యటనలు చేపడుతున్నారు. ఈ నెల 23 తరువాత కేంద్రంలో ఏర్పాటుకాబోయే ప్రభుత్వంలో ప్రాంతీయపార్టీలు కీలకపాత్ర పోషించాలని.. ప్రాంతీయపార్టీల వద్దకే జాతీయపార్టీలు వచ్చేలా అందరం కలిసి ముందుకువెళ్దామని ఈ సందర్భంగా కేసీఆర్ డీఎంకే అధినేతకు వివరించినట్లు సమాచారం.
గతంలో కూడా సీఎం కేసీఆర్ అప్పటి డీఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్తో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో ఫెడరల్ఫ్రంట్పై చర్చించారు. ఇప్పుడు మరోసారి స్టాలిన్తో సమావేశ మయ్యారు. కేసీఆర్ ఇటీవల కేరళ సీఎం పినరయి విజయన్తోనూ సమావేశమయ్యారు. కర్ణాటక సీఎం కుమారస్వామితో ఫోన్లో మాట్లాడారు. ఇతర పార్టీల నాయకులతో టచ్లో ఉన్నారు కేసీఆర్.