ఇస్రో మరో ప్రతిష్టాత్మక చేపట్టిన ప్రయోగం విజయవంతం అయ్యింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి బుధవారం సాయంత్రం జీఎస్ఎల్వీ మార్క్3 డీ2ను ప్రయోగించారు.
ముందస్తుగా నిర్ణయించిన సమయం ప్రకారమే సాయంత్రం 5.08 గంటలకు జీఎస్ఎల్వీ-మార్క్3డీ2 వాహక నౌక నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. జీశాట్-29 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి వాహక నౌక ప్రవేశపెట్టనుంది. మొత్తం 3,423 కిలోల బరువున్న కమ్యూనికేషన్ జీశాట్-29 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది.
జీశాట్-29 ఉపగ్రహంలో కేయూ, కేఏ బ్యాండు పేలోడ్లు ఉన్నాయి. ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇస్రో జీశాట్-29కు రూపకల్పన చేసింది. దీనిద్వారా మరో రెండు నూతన అంతరిక్ష సాంకేతికతలపై అధ్యయనం చేయనున్నారు.
మంగళవారం మధ్యాహ్నం 2.50 గంటలకు 27 గంటల కౌంట్డౌన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. జీఎస్ఎల్వీ-ఎంకేఐఐ డీ2 వాహక నౌక ద్వారా జీశాట్-29 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇస్రో చైర్మన్ కే శివన్ ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.
ఈశాన్య రాష్ట్రాలు, జమ్ముకశ్మీర్ ప్రజల కమ్యూనికేషన్ అవసరాలు తీర్చేందుకు ఇస్రో ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. భారత అంతరిక్ష పరిశోధనలో జీశాట్-29 ఉపగ్రహ ప్రయోగం కీలక మైలు రాయి కానున్నదని శివన్ తెలిపారు.