సంచలనం రేపిన మిర్యాలగూడ పరువు హత్యకేసులో నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ప్రణయ్ హత్య కేసులో A1 నిందితుడుగా అమృత తండ్రి మారుతీరావు , A2 నిందితుడుగా బాబాయి శ్రవణ్ కుమార్ లను చేర్చిన సంగతి తెలిసిందే.
ఈ హత్యకు ముందే అమృత తండ్రి మారుతిరావు మిర్యాలగూడ నుండి వెళ్ళిపోయాడు. తన కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో అమృత తండ్రే ప్రణయ్ ను హత్య చేయించినట్లు అనుమానిస్తున్న పోలీసులు అతన్ని ఎ1 నిందితుడిగా చేర్చారు. అలాగే అమృత బాబాయ్ ని ఎ2గా నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలచేత గాలింపు చేయించారు.
దళిత యువకుడికి తన కూతురినిచ్చి పెళ్లి చేయడానికి అమృత తండ్రి మారుతిరావు ఒప్పుకోలేదు. దీంతో తండ్రిని ఎదిరించి మరీ అమృత తాను ప్రేమించిన ప్రణయ్ ని పెళ్లి చేసుకుంది.దీంతో వీరిపై కోపాన్ని పెంచుకున్న మారుతిరావు అల్లున్ని చంపడానికి కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో మారుతి రావుతో పాటు అతడి సోదరుడు శ్రవణ్ కోసం పోలీసులు నిన్నటి నుండి గాలిస్తున్నారు. హైదరాబాద్లో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
అల్లుడు ప్రణయ్ ను తానే హత్య చేయించానని మారుతీరావు అంగీకరించాడు. కుమార్తె తన ఇష్టానికి వ్యతిరేకంగా వేరే కులస్తుడిని పెళ్లి చేసుకోవడంతోనే ఈ దారుణానికి తెగబడినట్లు వెల్లడించాడు. ప్రణయ్ ను హత్య చేసేందుకు రూ.10 లక్షలతో డీల్ కుదుర్చుకున్నట్లు పేర్కొన్నాడు.కాగా, నిందితుడిని పోలీసులు మరికాసేపట్లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు.
ణయ్ హత్య నేపథ్యంలో ఈ రోజు దళిత సంఘాలు మిర్యాలగూడలో బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటుచేశారు. బంద్ నేపథ్యంలో నగరంలోని దుకాణాలు, షాపులు మూతపడ్డాయి.