సీఎం చంద్రబాబునాయుడిపై కాపు ఉద్యమ నేత ముద్రగడ నిప్పులు చెరిగారు. మరోసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డకున్నారు. పాదయాత్రకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి అందించి, రూట్ మ్యాప్ కూడా పంపామని చెప్పారు. అయినా కూడా అడ్డుకోవడం దారుణమని అన్నారు.
సీఎం గారి మీద దండయాత్ర చేసేంత ధైర్యం, దమ్మూ మాకు లేదు. అనవసరంగా పాదయాత్రపై ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో తెలీడం లేదు. పోలీసులు కూడా సీఎంకు వంత పాడటం సిగ్గుచేటు. నేను ఎందుకు నడవకూడదో.. ఎవరూ చెప్పడం లేదు. ఇక్కడేమైనా బ్రిటిష్ పాలన సాగుతోందా?. ఏంటి నిర్భందం. ఎంతకాలం ఇలా. నాకు సమాధానం కావాలి.అధికారంలో ఉన్న మీరు, మీ మావయ్య గారు 1995లో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయలేదో చెప్పాలి.
మా జాతిని చులకనగా చూస్తున్నారు. నంద్యాల, కాకినాడలో కులాల పేరుతో మీరు చేసిందేంటి. మీ ఓట్ల కోసం, అధికారం కోసం కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మీరు, మీ కుమారులు, మీ మనవడు 2050 వరకూ పదవుల్లో సాగాలా?. మేం మీ పాద సేవ చేయాలా? మీకు బానిసల్లా ఉండాలా?. పోలీసులను పంపి మమ్మల్ని భయభ్రాంతులను చేయాలని చూస్తున్నారు.
పోలీసులతో పాలన చేయాలని చూసిన ప్రభుత్వాలు ఏవీ కూడా మనుగడ సాగించలేవు. ఎంతో కాలం నుంచి వేచి చూశాం. మా జీవితాలు ఇలానే విసిగి వేశారి పోవాలా?. మీరు కుల మీటింగ్లు పెట్టొచ్చు. ఇతర కులాలు మాత్రం సమిష్టిగా రోడ్ల మీదకు రాకూడదు. దేశానికి, దేశంలోని అన్ని కులాలకు స్వతంత్రం వచ్చింది. కానీ మా జాతికి ఇంకా స్వతంత్రం రాలేదని మేం భావిస్తున్నామన్నారు. ఎన్నికుట్రలు చేసినా పాదయాత్రను ఆపె ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు.