ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణపై నాంపల్లి కోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాధాకృష్ణ తదితరులపై వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పరువునష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో రాధాకృష్ణ ఈరోజు కోర్టుకు హాజరుకాకపోవటంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరువునష్ట దావా కేసులో రాధాకృష్ణ తదితరులు ఎందుకు కోర్టుకు హాజరుకాలేదో సంజాయిషీ చెప్పాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా వచ్చేనెల 5వ తేదీన తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలంటూ న్యాయమూర్తి కండిషనల్ ఆర్డరు పాస్ చేసారు
కాగా ఏపీ ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించింది. దీంతో వైఎస్ జగన్పై తప్పుడు కథనం ప్రచురించి, ఆయన పరువు.. ప్రతిష్టను దెబ్బ తీసినందుకు పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, పబ్లిషర్ వెంకట శేషగిరిరావు, ఎడిటర్ శ్రీనివాస్, మరికొందరు ఉద్యోగులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.