నంద్యాల లోక్ సభ సభ్యుడు, జనసేన నేత ఎస్పీవై రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ, హృద్యోగ సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 09.30లకు తుది శ్వాస విడిచారు.
ఎస్పీవై రెడ్డి ప్రస్తుతం నంద్యాల సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇటీవల ఏపీలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున నంద్యాల నుంచి పోటీచేశారు. నంద్యాల ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టిన నేతగా మూడు సార్లు ఎంపీగా హ్యాట్రిక్ విజయాలతో పాటు నంద్యాల మునిసిపల్ చైర్మన్ గానూ సేవలందించిన ఎస్పీవై రెడ్డి భౌతికకాయం నంద్యాల శివారులోని బొమ్మలసత్రంలోని ఆయన ఇంటికి చేరింది. ఆయనకు కడసారి నివాళులు అర్పించేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.
బీజేపీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు ఎస్పీవై రెడ్డి. బీజేపీ తరపున 1991 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు, నంద్యాల స్థానాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసినా ఓడిపోయారు. 2000లో నంద్యాల మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున పోటీచేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు.ఎస్పీవై రెడ్డి పూర్తి పేరు ఎస్. పెద్ద యెరికల్ రెడ్డి. జూన్ 4, 1950లో కడప జిల్లా అంకాలమ్మ గూడూరులో ఆయన జన్మించారు.
1984లో నంది పైపుల పేరుతో పీవీసీ పైపుల తయారీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్పీవై రెడ్డి మృతితో జనసేన శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. కర్నూలు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.నంద్యాల ప్రాంతంలో కరవు తాండవించిన వేళ, ‘రొట్టె, పప్పు’ కేంద్రాలను తెరిచి కేవలం రెండు రూపాయలకే లక్షల మంది ప్రజలకు ఆయన ఆహారాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు.