పెట్రోల్, డీజిల్ ఆరు నెలలకో లేదా ఏడాదికో మారు గతంలో పెంచేవారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు నిర్ణయంలో కొత్త విధానం తీసుకొచ్చింది. రోజురోజుకు ధరలు మారే విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఏరోజుకారోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. అయితే పదిహేను ఇరవై రోజులుగా ఒకరోజు ఉన్న ధరలు మరుసటి రోజు ఉండడం లేదు. ఈ విధంగా 17 రోజుల్లో 14 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం నేడు పెట్రోల్ ధరలు ఢిల్లీలో లీటరు రూ.73.95 ఉండగా.. కోల్కత్తాలో రూ.76.66గా, ముంబైలో రూ.81.8గా, చెన్నైలో రూ.76.72గా ధరలు ఉన్నాయి. డీజిల్ ధరలు కూడా ఢిల్లీలో లీటరుకు రూ.64.82గా, కోల్కత్తాలో రూ.67.51గా, ముంబైలో రూ.69.02గా, చెన్నైలో రూ.68.38గా నమోదయ్యాయి.
2017 జూన్లో రోజువారీ సమీక్ష చేపట్టినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోగా.. పెరుగుతూనే ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో పాటు, రూపాయి-డాలర్ మారక విలువ, దేశీయంగా పెట్రోల్, డీజిల్పై ప్రభుత్వం విధిస్తున్న పన్నులు ఈ ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని చెబుతున్నారు.
గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 70 డాలర్లకు చేరుకుంది. మంగళవారం కూడా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. దీంతో దేశీయంగా పెట్రల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయిలను చేరుకున్నాయని వెల్లడైంది. పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు గరిష్టాలను చేరుతుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పెట్రోల్ రికార్డు స్థాయి రూ.80కి చేరే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలం ఎండలు తీవ్రమవుతుండగా దానికి తోడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తీవ్రమవుతున్నాయి.