పుష్కరం ఎవరికైనా పుష్కరమే. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల సమయంలో.. నదీ స్నానం ను కోరుకోని హైందవుడు ఉండడు. దీని వల్ల పవిత్రత వస్తుందని.. పాపాలు తొలగిపోతాయని హిందువులు భావిస్తారు.
మరి ఇప్పుడు అలాంటి పుష్కరాలు జరుగుతున్నాయి. గోదావరిలో కొన్ని కోట్ల మంది పుష్కరస్నానాలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అనేక మందికి పుష్కర స్నానం చేయాలనే అభిలాష కలుగుతోంది.
అలాంటి వారిలో జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు కూడా ఉండడం విశేషం. రాజమండ్రి సెంట్రల్ జైల్లో వివిధ నేరాల్లో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు పుష్కర స్నానం చేసే అవకాశాన్ని కోరుతున్నారు. ఎలాగూ పుష్కరఘాట్లు పక్కనే ఉన్నాయి కాబట్టి.. తాము కూడా అక్కడి వరకూ వచ్చి పుష్కర స్నానాలు చేస్తామని వారు జైలు అధికారులను కోరుతున్నారు.
దాదాపు వందమందికి పైగా ఖైదీలు అధికారులకు ఈ విషయంలో విన్నపాన్ని పెట్టుకొన్నారు. ఏవేవో పాపాలు చేసి జైళ్లకు వచ్చిన తమకు పుష్కరస్నానం చేసే అవకాశం ఇప్పించి పాపాలను కడుక్కొనే అవకాశం ఇప్పించాలని వారు కోరుతున్నారు. మరి ఈ విషయంలో హోం శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉందట. మరి వారికి పుష్కర స్నానం చేసే అవకాశాన్ని ఇస్తారో ఇవ్వరో చూడాలి!