కొందరు 11వ తేదీ అని.. మరికొందరు 14వ తేదీ అని అర్థరహితమైన వాదనలు వినిపిస్తున్నారని విద్వత్సభ అధికార ప్రతినిధి వెంకటరమణ శర్మ వివరించారు. 14, 15, 16 తేదీల్లోనే భోగి, సంక్రాంతి, కనుమ ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం, శృంగేరీ పీఠం కూడా స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ తేదీల ప్రకారమే సెలవులు కూడా ప్రకటించినట్లు తెలిపారు.
సంక్రాంతి పండుగ ఎప్పుడూ అనే దానిపై కొంత గందరగోళం నెలకొని ఉంది. పండుగ ఎప్పుడు జరుపుకోవాలో తెలియక ప్రజలు గందరగోళంలో ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్వత్సభ ప్రతినిధులు జనవరి 15వ తేదీ సోమవారం సంక్రాంతి పండుగ అని స్పష్టం చేశారు. 14వ తేదీ రాత్రి 7:15 గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడని.. ఆ మరుసటి రోజు 15వ తేదీన సంక్రాంతి పండుగ జరుపుకోవాలని తెలిపారు. 14వ తేదీన భోగి, 16న కనుమ అని వివరించారు.
పండుగకు ఎలాంటి ప్రజలు ఎవరూ కూడా అనుమానాలు పెట్టుకోవద్దని కోరారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారిని కలిసి సంక్రాంతి పండుగ తేదీల వివాదంపై వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కూడా 15వ తేదీనే సంక్రాంతి పండుగగా గుర్తించినట్లు రమణాచారి వెల్లడించారు.