తమిళనాడులో రాజకీయాల్లో మార్పుగా నిలిచి ఇప్పుడు జైలులో ఉంటున్న శశికళ విషాదంలో మునిగింది. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ నిందితురాలిగా ఉన్న ఆమె షాకుల మీద షాకులు తగులుతున్న సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంలో విషాదం కలిగింది. ఆమె భర్త ఎం.నటరాజన్ అనారోగ్యంతో మృతిచెందారు.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శశికళ భర్త ఎం.నటరాజన్ (73) చికిత్స పొందుతూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. గతేడాది అక్టోబర్లో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నఆయనకు మళ్లీ ఇదే సమస్య తలెత్తడంతో రెండు వారాల నుంచి గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున 1.35 గంటలకు నటరాజన్ మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. గతంలో ప్రజా సంబంధాల అధికారిగా పనిచేసిన నటరాజన్.. 1975లో శశికళను వివాహం చేసుకున్నారు. అంతేకాక జయలలితకు కొన్నాళ్ల పాటు రాజకీయ సలహాదారుగానూ ఆయన వ్యవహరించారు.
చెన్నై బీసెంట్నగర్లోని తన నివాసానికి ఆయన భౌతికకాయాన్ని తరలించనున్నారు. భర్త మరణవార్తను తెలుసుకున్న శశికళ విషాదంలో మునిగింది. భర్త మృతి పెరోల్ పొందడానికి దరఖాస్తు చేసుకున్నారు. 15 రోజులు పెరోల్ మీద శశికళ జైలు నుండి విడుదల కానున్నారు. బెంగుళూరు పరప్పన్ జైలు నుంచి చెన్నై వెళ్లి రేపు జరిగే నటరాజన్ అంత్యక్రియలకు ఆమె హాజరయ్యే అవకాశం ఉంది.