రాష్ట్రాలపై కేంద్రం ప్రభుత్వం వివక్ష పాటిస్తోందని.. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిబంధనలను సవరించడంతో దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై చర్చించేందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం నిర్వహించింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏర్పాటుచేసిన ఈ భేటీకి తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరు కాలేకపోతున్నట్లు ప్రకటించడం గమనార్హం. కేరళలో భేటీకి వెళ్లడం లేదని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తమిళనాడులోని పళనిస్వామి ప్రభుత్వం కూడా ఈ సమావేశానికి హాజరు కారాదని నిర్ణయించింది. ఆర్థికమంత్రి పన్నీర్సెల్వం ఈ సమావేశానికి వెళ్తారని తొలుత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే సమావేశానికి ఒక్కరోజు ముందు తమిళనాడు ప్రభుత్వం తన వైఖరి మార్చుకుంది.