అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదలతోపాటు కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుపై నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. వరుసగా నాలుగో రోజు నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు పతనమవగా.. నిఫ్టీ 10,600 దిగువకు పడిపోయింది. మరోవైపు రూపాయి క్షీణత కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను తీవ్రంగా దెబ్బతీసింది.
అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధర 80 డాలర్లకు చేరువకావడం భారత ద్రవ్యలోటుపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ఆందోళనల నడుమ గురువారం నాటి ట్రేడింగ్లో అమ్మకాలు చేపట్టిన మదుపర్లు నేడు కూడా అదే బాటపట్టారు.
మరో వైపు కర్నాటక సెంటీమెంట్ దెబ్బ తో ఉదయం నుంచే సూచీలు నష్టాలతో సాగాయి. మార్కెట్ ఆరంభంలో 150 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్ ఆ ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఆద్యంతం అమ్మకాల ఒత్తిడితో అంతకంతకూ దిగజారిపోయింది. చివరకు 301 పాయింట్లు కోల్పోయి 34,848 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 86 పాయింట్ల నష్టంతో 10,596 వద్ద స్థిరపడింది.
ఎన్ఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్, టెక్మహింద్రా, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, హిందుస్థాన్ యునిలివర్, కొటక్ మహింద్రా బ్యాంక్ లాభపడగా.. సిప్లా, విప్రో, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, సన్ఫార్మా, టాటామోటార్స్ షేర్లు నష్టపోయాయి.