ప్రస్తుతం చట్టసభల్లో నేరచరిత్ర ఉన్న రాజకీయ నాయకులకు కొదువలేదు. చట్టాల్లో ఉన్న లొసుగులను ఉపయేగించుకొని నేరచరిత్ర ఉన్నా మళ్లీ ఎన్నికల్లో పోటీచేయడం గెలవడం చట్టసభల్లో తిష్టవేసికూర్చున్నారు.ఇది నిజంగా దేశ ప్రజలు సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితులు. తాజాగా నేర చరిత్ర ఉన్న ప్రజాప్రతినిధుల లిస్ట్ను కేంద్రం విడుదల చేసిన లెక్కలు చూస్తే ఎవ్వరైనా అవాక్కవ్వాల్సిందే.
చట్టసభలు ప్రజలకు దేవాలయంతో సమానం. చట్టాలను రూపొందించడం, ప్రజాసమస్యలను చర్చించి వాటికి పరిస్కార మార్గాలు చూపడం విధి. అలాంటి దేవాలయాల్లో నేర చరిత్ర ఉన్న వాల్లకు స్థానం కల్పించడం అంటే మనం సిగ్గుపడాల్సిన విజయం. నేర చరిత్ర ఉన్న నాయకులందరూ మంత్రులుగా, ప్రజా ప్రతినిధులుగా దర్జాగా కులుకుతున్నారు. అయితే ఇప్పుడు అలాంటి పప్పులు ఉడకవు. నేరం రుజువైతే వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీదితకాలం నిషేధం విధించబడుతుంది.
అసలు విషయానికి వస్తే చట్టసభ ప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను విచారించేందుకు 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అంగీకరించింది. కొంత గడువు ఇస్తే వారిపై ఉన్న కేసుల సమాచారం మొత్తం సేకరించి విచారణను వేగవంతం చేస్తామని మంగళవారం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.
2014 వరకు పదవుల్లో ఉన్న వారే కాకుండా ప్రస్తుతం కొనసాగుతున్న మొత్తం 1,581మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై 13,500 కేసులు పెండింగ్లో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇలా నేర చరిత్ర ఉన్నవారే మళ్లీ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
కేసులతో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులను సత్వరమే విచారించి, చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని ఆదేశించింది . 2015లో దీనిపై కేంద్రం వైఖరిని తెలియజేయాలని తెలిపిన సర్వోన్నత న్యాయస్థానం, గత నవంబరులో మరోసారి దీనిపై కేంద్రానికి గుర్తుచేసింది. నేరాలకు పాల్పడినట్లు రుజువైతే వారిని శాశ్వతంగా ఎన్నికల్లో పోటీచేయడానికి అనుర్హలుగా ప్రకటిస్తామని కూడా గత నెలలో కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.
ప్రతీ సంవత్సరం ఎన్నికల్లో పోటీ చేసే నేరస్తుల సంఖ్య పెరుగుతోందే కాని తగ్గడంలేదు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్కూడా ఏం చేయలేకపోతోంది. అందుకే సుప్రింకోర్టు స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చట్టసభల్లోకి నేరచరితులు ప్రవేశించకుండా ఉండాలంటే మార్గమేంటని ? ఎప్పుడు సూచిస్తారని సుప్రీంకోర్టు కేంద్రానికి సూటిగా ప్రశ్నించింది. దీంతో కేంద్రం దిగి వచ్చి 12 ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేయడమే కాకుండా మొత్తం రూ.7.80 కోట్లు కేటాయిస్తామని సుప్రీంకోర్టుకు హమీ ఇచ్చింది.
అంతేకాదు రాజకీయాల్లో నేరస్థులను అడ్డుకోడానికి ఓ ప్రత్యేక చట్టం రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని విచారణ సందర్భంగా కోర్టును ఈసీ కోరింది. సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలపై ఈసీ వివరణ ఇస్తూ… నేరాలకు పాల్పడినవారిపై ఎన్నికల్లో పోటీచేయకుండా జీవిత కాలం నిషేధించాలని కేంద్రానికి సిఫార్సు చేశామని న్యాయవాదులు మీనాక్షి అరోరా, మోహిత్ డీ రామ్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆరేళ్లను జీవితకాలంగా మార్చాలని సూచించినట్లు తెలిపారు. కానీ దీనిపై నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.