తమ రాష్ట్ర ప్రజల కోసం తమిళనాడు సినీ పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ప్రజలకు ఏమైనా కష్టమొస్తే రాజకీయ నాయకుల కన్నా ముందు సినీ పరిశ్రమకు చెందిన వారంతా ముందుకు వస్తారు. అందుకే అక్కడి సినీనటీనటులపై తమిళ తంబీలు గుళ్లు, గోపురాలు, రక్తతర్పణం తదితర కార్యక్రమాలు చేపడతారు. ఇప్పుడు కోలీవుడ్ మరో ఉద్యమం చేపట్టనుంది. తమ రాష్ట్ర ప్రజల కోసం ముందుకు కదలనుంది.
కావేరి నది బోర్డు ఏర్పాటు చేయాలని, స్టెర్లైట్ కర్మాగారానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని తమిళనాడు సినీ పరిశ్రమ నిర్ణయించింది. ఏప్రిల్ 8వ తేదీన స్థానిక నుంగంబాక్కంలోని వళ్లువర్కోట్టం వేదికగా దక్షిణ భారత నటీనటుల సంఘంతో పాటు చిత్ర పరిశ్రమ మొత్తం ఆందోళనకు సిద్ధమైంది. ఈ ఆందోళన ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నిర్వహిస్తున్నట్లు దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రకటించింది.
తూత్తుక్కుడిలోని స్టెర్లైట్ కర్మాగారాన్ని (ఫ్యాక్టరీని) మూసి వేయాలని, కావేరి నది జలాల వ్యవహారంలో ప్రత్యేక బోర్డు నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. వీటిపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా తమిళ చిత్ర పరిశ్రమ ఆందోళన జరపనుంది. ఈ ఉద్యమంలో సినిమా పరిశ్రమకు చెందిన వారందరూ పాల్గొనాలని విశాల్, నాజర్, నడిగర్ సంఘం తదితరులు విజ్ఞప్తి చేశారు.
తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా కావేరి బోర్డు నియామకం కోసం ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. స్టెర్లైట్ ఫ్యాక్టరీ వలన స్థానికులు పడుతున్న ఇబ్బందులపై స్పందించారు. మరీ ఏప్రిల్ 8వ తేదీన తమిళనాడులో ఏం జరుగుతుందో చూడాలి. ఈ ఆందోళనకు పెద్ద ఎత్తున ప్రచారం… విజయవంతమైతే మాత్రం మరో జల్లికట్టు ఉద్యమం మాదిరి జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్ననే అధికార పార్టీ అన్నాడీఎంకే ఆందోళనలు చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిరాహార దీక్షకు కూర్చోవడంతో సమస్య తీవ్రమైంది.
మరీ కోలీవుడ్ మాదిరి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు లేదో అర్థం కాదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం తెలుగు సినీ పరిశ్రమ ముందుకు రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తమకు లైఫ్ ఇస్తున్న ప్రజలను పట్టించుకోకపోవడంపై ప్రజలు, అభిమానులు, రాజకీయ పార్టీలు కూడా టాలీవుడ్పై మండిపడుతున్నారు.