కావేరీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. పార్లమెంట్లో నిరంతరం పోరాటం చేస్తూ అవిశ్వాస తీర్మానానికి అడ్డు పడుతున్న అన్నాడీఎంకే ఎంపీలు ఇప్పుడు తమిళనాడులో కొత్త తరహా ఆందోళన చేపట్టారు. తమ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళనలు చేపడుతుంటే తమిళనాడు రాష్ట్రంలో అధికార పార్టీ, అన్నాడీఎంకే ప్రభుత్వం ఆందోళనను ఉధృతం చేసింది.
ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిరాహార దీక్షకు కూర్చున్నారు. తమిళనాడులోని అధికార పార్టీగా ఉన్న అన్నాడీఎంకే ఆందోళన చేపట్టడంతో రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. మంగళవారం (ఏప్రిల్ 3) అకస్మాత్తుగా ముఖ్యమంత్రి ఎడపాడి పళని స్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిరాహార దీక్షకు దిగారు.
వెంటనే కావేరీ జలాల మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నాడీఎంకే మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఒక నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. ఈ నిరాహార దీక్షలో పార్టీ శ్రేణులు, నేతలు, మంత్రులు పాల్గొంటున్నారు. అయితే ఈ ఆందోళనలో సీఎం పళని, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ పాల్గొనాలని కార్యాచరణ లేకున్నా వాళ్లు తమ తీవ్రత చెప్పేందుకు ఆందోళనలో పాల్గొన్నారు.
ఇటీవల కావేరి జలాల విషయంలో కర్నాటకకు మద్దతుగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో తమిళనాడులో ఆందోళనలు మొదలయ్యాయి. ప్రస్తుతం అవి తీవ్రరూపం సంతరించుకున్నాయి.