- మిత్రుడికి సీఎం కేసీఆర్ పరామర్శ
- గుర్తుపెట్టుకొని కలవడంపై ఆ కుటుంబం ఆనందం
స్నేహితులను గుర్తు పెట్టుకొని పలకరించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శైలి భిన్నం. రాజు అయినా పేద అయినా అవేవి పట్టించుకోకుండా తన హోదాను పక్కనబెట్టి స్నేహితులను పలకరిస్తుంటాడు. ముఖ్యమంత్రిననే దర్పం స్నేహితుల ముందే అస్సలు చూపించరు. అదే విధంగా తనకు పాఠాలు చెప్పిన గురువుల వద్ద కూడా వినయంగా ఉంటాడు. గురువులకు పాదాభివందనం చేసి గురువు గొప్పదనాన్ని ఎన్నోసార్లు చాటారు. తన స్నేహితులు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే పలకరించేస్తుంటారు. ఈసారి కూడా తన స్నేహితుడు అనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకొని వెంటనే కేసీఆర్ పరామర్శించారు.
1985 సమయంలో యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాజేంద్రప్రసాద్, కేసీఆర్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలో వీరిద్దరూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అప్పుడు చిగురించిన వీరి బంధం ఇంకా కొనసాగుతోంది. రాజేంద్రప్రసాద్ హైదరాబాద్ గాంధీనగర్లోని ఉదయ్ సఫేర్ అపార్ట్మెంట్లో నివసిస్తుంటాడు. పదేళ్లుగా రాజేంద్రప్రసాద్ పక్షవాతం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుసుకున్న సీఎం కేసీఆర్ శనివారం పరామర్శించారు. దాదాపు 45 నిమిషాల పాటు స్నేహితుడి ఇంట్లో గడిపారు. అతడి ఆరోగ్యం, వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 1985లో రాజేంద్రప్రసాద్ పోటీ చేశారు. తనను గుర్తుపెట్టుకుని సీఎం పరామర్శించడంపై ఆ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. వారిద్దరూ నాటి తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
https://www.youtube.com/watch?v=_JdIEFwn-M8