ఎగుమతులే లక్ష్యంగా 2021లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) పనిచేయనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ జి.సతీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు జరిగిన డీఆర్డీవో 63 వ ఆవిర్భా వ దినోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ను కలిసి ఎగుమతులకు అనుమతి పొందిన ఆకాశ్ క్షిపణి నమూనాను జ్ఞాపికగా అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఛైర్మన్, డైరెక్టర్ జనరళ్లు, ఇతర డైరెక్టర్లు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దల్ కలాం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
దేశ రక్షణ అవసరాలకు తగ్గట్టు ఆయుధాలు అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం 1958లో 10 ప్రయోగశాలలతో డీఆర్డీవోని ఏర్పాటు చేసింది. గతేడాది తమ సంస్థ బహుళ విజయాలు సాధించినట్లు సతీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు ప్రారంభమవుతున్న కొత్త సంవత్సరంలో మరిన్ని నూతన ఆవిష్కరణలతో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. 2020లో ఎన్నో మైలురాళ్లను చేరుకున్నట్లు తెలిపారు. కొవిడ్ను ఎదుర్కొనేందుకు తమ సంస్థ ఆధ్వర్యంలోని 40 ప్రయోగశాలల్లో దాదాపు 50కిపైగా సాంకేతిక పరిజ్ఞానాలు, 100కిపైగా ఉత్పత్తులు అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.